(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న హుజూర్నగర్ ఉప ఎన్నికల ఫలితం టీఆర్ఎస్ ఖాతాలో పడనుంది. తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 17,400 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి వెనుకంజలో ఉన్నారు. తొలి రౌండ్ నుంచే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన టీఆర్ఎస్, అన్ని రౌండ్లలో మెజారిటీని సాధించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయో అని మొదట అనుకున్నప్పటికీ ఆ ప్రభావం ఏ మాత్రం ఎన్నికలపై పడలేదు. ఇందుకు రౌండ్ రౌండ్కు పెరుగుతున్న ఆధిక్యమే నిదర్శనమని అని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 25 వేలకు పైగా టీఆర్ఎస్ మెజార్టీని అంచనా వేస్తోంది.
ఈ నియోజకవర్గ ఎన్నికను అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయన్న సంగతి తెలిసిందే. రెండు పార్టీలూ హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహించాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన ఓటర్లు, ఈ దఫా టీఆర్ఎస్ వైపు నిలవడం గమనార్హం. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫలితం తేలనుంది. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులతో పాటు మొత్తం 28 మంది పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికతో తెలంగాణలో ఇక కాంగ్రెస్ పని అయిపోయిందంటూ టీఆర్ఎస్ విమర్శలు మొదలు పెట్టింది.
గ్రూపు గొడవలే మరోసారి కాంగ్రెస్ను దెబ్బతీశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె, టీఆర్ఎస్ సర్కార్పై విమర్శలను సొమ్ము చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమయ్యామని కొందరు సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారట. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సిట్టింగ్ స్థానాన్నే చేజార్చుకోవడంపై కాంగ్రెస్లో అంతర్మథనం మొదలైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.