ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన రాజధానిగా చెప్పబడుతున్న విశాఖపట్నం లో రౌడీషీటర్లు కత్తులు దూసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తీర ప్రాంతంలో విచక్షణరహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న తీరు చూసి అక్కడి ప్రశాంత వాతావరణం కాస్తా ఒక్కసారిగా భగ్గుమంది. ఒక పుట్టినరోజు వేడుకల్లో రౌడీషీటర్లు కత్తులతో దడి చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి వెంటనే పరిస్థితిని శాంతపరిచే ప్రయత్నం చేశారు.
వివరాల్లోకి వెళితే గాజువాక సమీపంలోని పెదగంట్యాడ మండలం సీతానగరం లో జరిగిన ఈ గ్యాంగ్ వార్ లో ఒక వివాదం చెలరేగి ఈ రెండు వర్గాలు కత్తితో పరస్పరం దాడులకు ప్రయత్నించారు. సీతానగరం ఆర్ హెచ్ కాలనీలో మొల్లి మహేష్ అనే యువకుడు నిర్వహించిన పుట్టినరోజు వేడుకలలో రౌడీషీటర్ మొల్లి సంతోష్ కూడా పాల్గొన్నాడు. అదే వేడుకకి వడ్లపూడి చెందిన మరొక రౌడీషీటర్ గందవరపు తరుణ్ కూడా వచ్చాడు. ఈ క్రమంలోనే అంతా బాగా వేడుకలో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇక ముందు నుంచే పోలీసులకి వీరిద్దరూ కలిసి ఒక పార్టీ కి వెళ్ళబోతున్నారని సమాచారం వచ్చిందట. దానితో వారిపై ఒక కన్ను వేసి ఉండగా…. వీరిద్దరి మధ్య పాత గొడవలు కూడా ఉండటంతో డిజిపి సవాంగ్ నేతృత్వంలోని పోలీసు శాఖ చాలా అప్రమత్తంగా ఉన్నారు. అనుకున్నట్టే ఇద్దరికీ మాట మాట పెరిగి అదికాస్తా ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు దాడులకు దిగి చివరికి కత్తులతో ఇరువర్గాలు పరస్పరం దాడులకు ప్రయత్నించారు.
దీనితో వెంటనే డీజీపీ సవాంగ్ అతన్ని బృందాన్ని అలెర్ట్ చేసి వారందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు న్యూ పోర్టు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ గొడవ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు.
ఇకపోతే సినిమాటిక్ స్టైల్ లో జరిగిన ఈ గొడవకు గతంలో సబ్బవరం మండలం లో చెలరేగిన వివాదం కారణమని పోలీసులు చెబుతున్నారు. గాజువాక, పెదగంట్యాడ, సబ్బవరం మండలాల పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు, సెటిల్మెంట్లు, భూకబ్జాలు మరియు కత్తులతో దాడులు చేసుకోవడం మొల్లి సంతోష్ అలియాస్ సోనాసంత్ కి అలవాటు అనే అంటున్నారు. ఒక్క న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ లోనే ఇతని పై 12 కేసులు ఉన్నట్లు సిఐ తెలిపారు.
అలాగే వడ్లపూడికి చెందిన గందవరపు తరుణ్ బిటెక్ చదివి కూడా నేరాల బాట పట్టినట్లు పోలీసులు తెలిపారు. అతడు ఓ హత్య కేసులో ప్రధాన ముద్దాయి, అంతేకాకుండా స్తెబర్ నేరాలు చెయ్యడంలో దిట్ట అని తెలిపారు. అలాగే తరుణ్పై ఐదు కేసులున్నట్లు సీఐ పేర్కొన్నారు.