గతంలో రోజా వ్యవహారంలో కోడెల సైతం…
చట్టసభల నిర్ణయాల్లో జోక్యం తగదు..
ఏపీలో కొంత కాలంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. పలు నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పు బట్టాయి. కొన్నింటిని కొట్టివేసాయి. తాజాగా.. పాలనా వికేంద్రీకరణ బిల్లులపైన హైకోర్టు ఈ నెల 14వ తేదీ వరకు స్టేటస్ కో అమలు చేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. మధ్యంతర ఉత్తర్వులు అమలు కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఇదే సమయంలో స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు చేసారు. చట్ట సభలు తీసుకున్న నిర్నయాలు..చేసిన చట్టాల పైన న్యాయస్థానాలు జోక్యం చేసుకోవటం తగదని తమ్మినేని వ్యాఖ్యానించారు. కేంద్రం సైతం ఇదే విషయాన్ని హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది. ఇప్పడు తమ్మినేని సైతం ఇదే చెబుతున్నారు. కోర్టులు ఒక వేళ జోక్యం చేసుకొని తీర్పులు ఇస్తే తాము వాటిని సమీక్షిస్తామని చెబుతున్నారు. ఒక వ్యవస్థ నిర్ణయాల్లో మరో వ్యవస్థ జోక్యం చేసుకోరాదనే విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారని గుర్తు చేసారు. దీంతో..ఇప్పుడు మూడు రాజధానుల వ్యవహారంలో కోర్టుల్లో పిటీషన్లు దాఖలు చేయటం…కోర్టుల తీర్పుపైన ఉత్కంఠ నడుమ ఇప్పుడు స్పీకర్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి కర చర్చకు కారణమవుతున్నాయి.
కేంద్రం అఫిడవిట్…స్పీకర్ కీలక వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం చట్టం చేసిన అధికార వికేంద్రీకరణ..సీఆర్డీఏ చట్టాల పైన అమరావతి రైతులు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేసారు. వీటి పైన ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ హైకోర్టు చట్టాల అమలు పైన స్టేటస్ కో అమలు చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమారాతి నుండి పరిపాలనా రాజధాని తరలింపు వ్యతిరేకిస్తున్న వారంతా న్యాయ స్థానాల్లో ఈ చట్టాలు నిలబడవనే ఆశతో ఉన్నారు. ఇక, శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి ఈ బిల్లులను పంపాలనే నిర్ణయం అమలు కాలేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసారు. ఇలా..ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక నిర్ణయాల పైన కోర్టుల్లో పిటీషన్లు పెండింగ్ లో ఉండటంతో..
ఈ వ్యవహారం ముందుకు సాగుతుందా లేదా అనే అనుమానాలు ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో..స్పీకర్ తమ్మినేని ఇదే సమయంలో చేసిన వ్యాఖ్య లతో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుందనే ఉత్కంఠ మొదలైంది. కోర్టు తీర్పు ఇచ్చినా..తాము వాటిని సమీక్షిస్తామంటూ ఆయన మీడియాతో జరిగిన ఇష్టాగోష్టిలో వ్యాఖ్యానించినట్లుగా మీడియాలో రిపోర్ట్ చేసారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటే కానప్పుడు పెండింగ్ లో ఎలా ఉంటుందని తమ్మినేని ప్రశ్నిస్తున్నారు. సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపాలంటే ఖచ్చితంగా ఓటింగ్ జరగాల్సిన అవసం ఉందని..అయితే అది చోటు చేసుకోనప్పుడు సెలెక్ట్ కమిటీ అంశమే ఉత్పన్నం కాదని తేల్చి చెప్పారు.
గతంలో కోడెల సైతం..రోజా విషయంలో
శాసనసభలో తీసుకున్న నిర్ణయాలు..శాసనసభ అధికారాలు..కోర్టుల జోక్యం అనే అంశం ఇప్పుడు పెద్ద చర్చకు కారణమవుతోంది. కేంద్రం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో సైతం శాసనసభలో జరిగిన చర్చల పైన కోర్టులు జోక్యం చేసుకోలేవంటూ పేర్కొనటం ఏపీ ప్రభుత్వానికి ఊరటనిచ్చే విషయం. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంోల కాల్ మనీ అంశం పైన సభలో చర్చకు వచ్చింది. ఆ సమయంలో విపక్ష సభ్యురాలిగా ఉన్న రోజా..నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పైన కొన్ని వ్యాఖ్యలు చేసారు. దీంతో..సభలో నాటి శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి తీర్మానం ప్రతిపాదించటం..స్పీకర్ స్థానం లో ఉన్న కోడెల మూడ్ ఆఫ్ ది హౌస్ గా తీర్మానం ఆమోదిస్తూ ఏకంగా రోజాను ఏడాది పాటు సభ నుండి సస్పెండ్ చేసారు. దీన పైన రోజా న్యాయస్థానం ఆశ్రయించారు.
న్యాయస్థానం రోజా సస్పెన్షన్ పైన స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయినా..దీనిని అమలు చేయాలా వద్దా అనే అంశం పైన సభలో స్పీకర్ చర్చ పెట్టారు. స్పీకర్ విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకోవాలని నాటి టీడీపీ సభ్యులు సూచించారు. దీంతో..సభలో జరిగిన వ్యవహారం పైన కోర్టు ఆదేశాలను అమలు చేయమంటూ..రోజా ను సభలోని అనుమతికి నిరాకరించారు. కనీసం అసెంబ్లీ ప్రాంగణంలోకీ అనుమతించలేదు. ఇక, ఇప్పుడు తమ్మినేని చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తే..రాబోయే రోజుల్లో ఏం జరుగే అవకాశం ఉందనే ఆసక్తి కర చర్చ అటు ప్రభుత్వంలో ..ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో చర్చ సాగుతోంది.