పిల్లల్లో ఆ ఊహాశక్తిని పెంచేది కథ చెప్పడం మాత్రమే అని ఒప్పుకోక తప్పదు.అనగనగా..అని చెప్పడం మొదలు కాగానే పిల్లలు ఊహా ప్రపంచంలోకి అడుగు పెడతారు. కథలో ఉన్న పాత్ర ల్లో తమను తాము చూసుకుంటారు. దృశ్యాన్ని చూస్తే అనుభూతి కలుగుతుంది. కానీ ఆలోచించే అవసరం పెద్దగా ఉండదు. కానీ కథ చెప్పడం, చదవడం, వినడం వల్ల పిల్లల ఊహ జగత్తు కు అంతమనేదే ఉండదు. సృజనాత్మక భావన బాగా పెరుగుతుంది.
కథ వింటూ ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలా ఎందుకు? ఇలా ఎందుకు? అని అడుగుతారు. దీంతో వారి ఆలోచనలకు పరిధి చాల పెద్దదవుతుంది. ప్రశ్నించే తత్త్వంతోబాటు సమస్యలను తేలికగా పరిష్కరించే శక్తి అలవాటవుతుంది. అన్నిటికీ మించి కొత్త,కొత్త పదాలను పరిచయం చేస్తూ భాషా గొప్పదనం తెలిసేలాకథలు బాగా ఉపయోగ పడతాయి.
మన చిన్నతనంలో తల్లీదండ్రులు, నానమ్మ,అమ్మమ్మ, తాతమ్మ, తాతయ్యలు మనకి పురాణ కథలు,నీతికథలు, జానపదకథలు, హాస్యకథలు, పేదరాసి పెద్దమ్మ కథలు చెప్తుంటే మయమరిచి వినేవాళ్ళం. దాని వల్ల మనకు ఎంతో కొంత లోకజ్ఞానం తో పాటు ఎన్నో విషయాలు నేర్చుకున్నే అవకాశం కలిగిందనే చెప్పాలి. మరీ.. ఇప్పటి తరం పిల్లల పరిస్థితి ఏంటి ?వారికి ఇలాంటి కథలు చెప్పే సమయం మనకు లేక పోగా కనీసం ఇంటిలో పెద్దవారు కూడా లేకపోవడం దురదృష్టం అనే చెప్పాలి. కాబట్టి పిల్లలను అలరించడానికి ఒక ఫోన్ ఇచ్చేస్తే చాలు అందులో వారు ఏం చేసుకున్నాకూడా మనకు అడ్డురాకుండ ఉంటే చాలు అని అనుకుంటాము. తల్లిదండ్రులు చేసే ఇలాంటి పనులవలన చిన్నతనంలో నే పిల్లలలో నేర పూరిత ఆలోచనలు , ప్రవృత్తి, సైబర్ నేరాలకు పాల్పడడం వంటివి చేస్తున్నారు .
ఆసక్తి కరంగా కథలు చెప్పడం వల్ల చిన్నతనం లోనే వారికి అనేక విషయాలపైనా అవగాహనా కలుగుతుంది. ఎలా ప్రవర్తించాలి, నీతిగా ఎలా బతకాలి, ప్రతీఒక్కరికి ఎలా సహాయకం చేయాలి, దాని వలన ఎలాంటి తృప్తి కలుగుతుంది, లాంటి విలువలు వారు కథల తో అర్ధం చేసుకుని ఆచరిస్తారు. అబ్బెబే మా పిల్లలు ఫోన్లో మంచి కథలు చూస్తున్నారు వింటున్నారు అంటారా … అది చాల పొరపాటు. అది వారి ఊహాశక్తిని పెంచలేదు. అని గుర్తు పెట్టుకుని మీరు స్వయంగా భావప్రకటన తో కథలు చెప్తూ చిన్న చిన్న ప్రశ్నలు వేస్తూ జవాబులు రాబడుతూ చెప్పి చూడండి అది వారికీ మీకు మధ్య మంచి అనుబంధాన్ని ఏర్పరుస్తుంది.
దీనివల్ల తల్లీదండ్రులతో వారికి ఓ మంచి బంధం ఏర్పడుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. జీవితంలో మనం ఎలా ఉండాలి ఎలాంటి సమస్యలు వస్తాయి, మనచుట్టూ ఉన్న మనుషులు గురించి, సమాజ కట్టుబాట్లు, ఇలా ప్రతీఒక్కవిషయాన్ని కథల రూపంలో చెబితే.. వారికీ అందమైన భవిష్యత్ని ఇచ్చినట్టవుతుంది. దీనివల్ల సమాజం లో నేరాలనుకట్టడి చేసినవారమవడం తో పాటు మన పిల్లల అందమైన జీవితాన్ని చూసి ఆనందపడొచ్చని సైకాలజిస్టులు చెబుతున్నారు. డబ్బు సంపాదించడం ముఖ్యమే కావొచ్చు.
కానీ అది కుటుంబం, పిల్లలకంటే ముఖ్యం కాదు అని గుర్తు పెట్టుకోవాలి. ఎంత డబ్బు సంపాదించినా కూడా పిల్లలను విలువలతో పెంచక పొతే అదంతా వృథా అనే చెప్పాలి. కాబట్టి ఎంత తీరిక లేకుండా ఉన్న రాత్రి పడుకునేముందు పిల్లలతో గడపండి. వారికి మంచి మంచి కథలు చెప్తూ, వాళ్ళ కబురులు వింటూ … పిల్లలను మంచి భవిషత్తు వైపుగా నడిపించడం ఇప్పటి తరం తల్లిదండ్రుల కనీస బాధ్యతగా భావించండి .