తెలుగు ప్రయివేటు టెలివిజన్ మొదలై పాతికేళ్ళు అవుతోంది! రెండు ఛానళ్ళ నుంచి వాటి సంఖ్య నేడు అరవైకి మించి పెరుగుతోంది. తెలుగు వార్తా ఛానళ్ళు పదిహేనుకు మించి పెరిగాయి. ఈ పదిహేను సంవత్సరాలలో, అంటే వార్తా ఛానళ్ళ సంఖ్య తెలుగు ఛానళ్ళలో మూడోవంతుకు, నాలుగోవంతుకు మధ్యన ఉంటుంది. జోనర్ పరంగా చూస్తే మిగతా ఛానళ్ళకన్నా వార్తా ఛానళ్ళ సంఖ్య అధికం. అయితే వ్యూయర్ షిప్, రేటింగ్, ప్రకటనలు వార్తా ఛానళ్ళకు కాకుండా జెమిని, ఈటీవీ, మా, జీ తెలుగు వంటి కుటుంబ ఛానళ్ళకే ఎక్కువ! అయినా వార్తా ఛానళ్ళ సంఖ్య తగ్గడం లేదు. జెమిని న్యూస్, జీ 24 గంటలు వంటివి ఇటీవల కాలంలో వివిధ కారణాలతో మూతపడ్డాయి. అయినా కొత్త వార్తా ఛానళ్ళు రావడం విశేషం. సుమారు 900 పై చిలుకు టీవీ ఛానళ్ళు మనదేశంలో ఉన్నాయి. అందులో నాలుగు వందలు పైగా వార్తా ఛానళ్ళు. ఈ నిష్పత్తిలో చూస్తే తెలుగు వార్తాఛానళ్ళు తక్కువని ఎవరైనా అనవచ్చు.
అయితే 15 సంవత్సరాలు పైబడిన చరిత్ర గలిగిన తెలుగు వార్తా ఛానళ్ళు ఏ స్థాయి పరిణితిని సాధించాయి? ఈ 15 ఛానళ్ల మధ్య పోటీ ఎలా సాగుతోంది? – అని ఆలోచించినపుడు తృప్తికన్న బాధా; ఆనందం కన్నా నిర్లిప్తత కలుగుతుంది. ఎందుకు?
టెలివిజన్ దృశ్యమాధ్యమం. కెమేరా చూపే దృశ్యం అనేది మాటలను మించి ఉండాలి. దృశ్యం చెప్పని విషయాన్ని వాచ్యంగా చేయాలి. ఇది చాలా మౌలికమైన అంశం. అయితే దీనిని గమనించినవారుగానీ, సదా దృష్టిలో ఉంచుకునే వారుగానీ, కొందరే సుమా! వార్తా ఛానళ్ళు అంటే కేకలు, అరుపులు, పెడబొబ్బలు అనే అభిప్రాయం స్థిరపడిపోయింది. తెలుగు న్యూస్ ఛానళ్ళు తాము ఆశించకుండానే ఈ దిశలోకి జారిపోయాయి. పదేళ్ళ క్రితం ఉన్న విశ్లేషణ స్థాయి తెలుగు వార్తా ఛానళ్ళలో నేడు కనబడటం లేదు. ఈ రకమైన చర్చలకు టెలివిజన్ తెరగానీ, కెమెరా గానీ చేయగలిగింది ఏమీలేదు.
ఇటీవల కాలంలో కొన్ని ఛానళ్ళకు కొన్ని పార్టీల ప్రతినిధులు వెళ్ళకపోవడం లేదా కొన్ని ఛానళ్ళు కొన్ని పార్టీల ప్రతినిధులనే పిలవడం పెరిగింది. అలాగే కొన్ని పార్టీలు కూడా కొన్ని ఛానళ్ళను అనుమతించకపోవడం కూడా జరిగింది. నిజానికి తెలుగు ఛానళ్ళలో అన్ని పార్టీల అభిప్రాయాలుంటాయి, తమిళ ఛానళ్ళ కన్న మెరుగు అనే రీతిలో గౌరవం ఉండేది. అయితే ఇటీవలి ధోరణులతో విభిన్న అభిప్రాయాలు కాకుండా కేవలం ఛానళ్ళ యాజమాన్యం నిర్ణయించిన లైన్ లోనే వార్తల తీరు నడుస్తోంది. విశ్వసనీయత ఖచ్చితంగా తగ్గుతోంది.
ఎన్ టీవీలో ఒక కార్యక్రమం ఉంది – ‘నా వార్తలు – నా యిష్టం’ అని. నిజానికి అది ప్రయివేటు న్యూస్ ఛానళ్ళ ప్రస్తుత తీరుకు సరిపోయే స్లోగన్. ఫలానా వార్త ఎందుకు ఇచ్చారు అని గానీ, ఎందుకు ఇవ్వలేదు అని గానీ సంపాదక శ్రేణులు చెప్పరు. వీక్షకులకు అడిగే అవకాశం లేదు. వీక్షకుల మధ్య పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరగాలి. దీనికి మిగతా మాధ్యమాలు వేదిక కావాలి.
తొలి దశలో సినిమా పాటల ఆడియో, వీడియో క్లిప్పింగులు కార్యక్రమాల్లో వాడుకునేవారు. కానీ వాటిని రూపొందించుకునే ప్రయత్నం చేయలేదు. అయితే నేడు అంతస్థాయిలో లేదు. ఇంతవరకు ఆనందపడాలి. అయితే 30-40 సెకన్ల దృశ్యాలను పదేపదే వార్తలలో చూపడం వీక్షకులకు హింసగా మారింది. ఈ మే నెలలో ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ అధికారుల సమావేశం అని స్ప్లిట్ స్క్రీన్ లో ఎన్నోసార్లు, ఎంతోసేపు చూపుతూ పోయారు.
జూనియర్ ఎన్టీఆర్ పెళ్ళి నిశ్చితార్థం, శోభన్ బాబు మరణం, ఒక యాంకర్ పెళ్ళి ఇలా చాలా సందర్భాలలో ఒకే వార్త చుట్టూ కార్యక్రమం నడపడం పరిపాటి. ఇంకా కొన్ని సందర్భాలలో ప్రియుడి బాధితురాలు ధర్నాలు చేయడం వంటి చిన్న విషయాలను గంట రెండు గంటల లైవ్ కార్యక్రమాలుగా చేయడం ఈ ధోరణికి పరాకాష్ఠ. గట్టి ఉదాహరణ చెప్పాలంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ వైపు మొగ్గు వంటి విషయం వదలి, వరదలతో ప్రజల ఇక్కట్లు వంటివి సైతం పరిహరించి కేవలం కరకట్ట వద్దే ఛానళ్లు ఆగి, సాగడంలాంటి వన్నమాట.
అసలు కష్టపడకుండా పత్రికల నుంచీ, నెట్ నుంచీ యథేచ్ఛగా స్వీకరించి కార్యక్రమాలు వండటం కూడా పెద్ద న్యూసెన్స్.
రుద్రాక్షలు, రేకులు, జ్యోతిష్యం, వివాహసంబంధాలు విద్యాసంస్థల ప్రకటనలు, సినిమాల ఆడియో రిలీజ్ ఫంక్షన్లు ఉంటే చెప్పా పెట్టకుండా వార్తల బులెటిన్ లను అప్పటికప్పుడు రద్దు చేయడం ఎంతో బాధ్యతారాహిత్యం.
తెలుగు వార్తా ఛానళ్ళ తీరుతెన్నులపై సమగ్రమైన, సవ్యమైన పరిశీలనగానీ, విమర్శగానీ అందుబాటులేదు. ఈ విధంగా చూస్తే ఛానళ్ళదే కాకుండా వీక్షకులవైపు నుంచి కూడా బాధ్యతారాహిత్యం ఉంది.
డా. నాగసూరి వేణుగోపాల్