ఛానళ్ళను కీలకంగా నిర్వహించేదెవరు? ఇది అప్పుడప్పుడు ఎదురయ్యే ప్రశ్న! కొన్ని బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గతంలో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సంబంధిత బ్యాంకులు కలిశాయి. ఇప్పుడు మొత్తంగా వాటిని ఎస్.బి.ఐ. అని వ్యవహరిస్తున్నారు. తర్వాత విజయాబ్యాంక్, మరో బ్యాంక్ రెండూ బ్యాంక్ ఆఫ్ బరోడాలో కలిశాయి. ఇది ఏప్రిల్ 1 నుంచి జరిగింది. ఇపుడు మరికొన్ని కలుస్తున్నాయి. అందులో ఆంధ్రాబ్యాంక్ కూడా ఉంది. దానితో కొన్ని ఛానళ్ళు ఆంధ్రుల మనోభిప్రాయాలు దెబ్బతిన్నాయంటూ తమకు తోచిన దారుల్లో చర్చల ఆగడాలు చేశాయి, చేస్తున్నాయి. దీనికి ముందు వాట్సాప్ల్లో సెటైర్లు, దాంతో ఛానళ్ళలో వెర్రి మొర్రి చర్చలు, ఫలితంగా పత్రికల్లో కూడా ఇదే తరహా తొలి పేజీ వార్తలు, సంపాదకీయ పుట వ్యాసాలు.
స్పందించాల్సినచోట అసలు శ్రమించని ఛానళ్ళుకు ఇలాంటి సమయాల్లో మహాదేశభక్తితో పూనకాలు వస్తాయి. పోలింగ్ ముందు మద్రాసులో పెద్దఎత్తున టిటిడి బంగారం – దాదాపు 430 కోట్ల విలువచేసే బంగారం పట్టుబడింది. ఆపూట అదేవార్త, అవే అరుపులు, అదే సంగీతం. తరవాత ఏమీ లేదు.
ఆ మధ్య డ్రగ్ కేసులో విచారణ ఎదుర్కొన్న సినిమాతారల వ్యవహారం ఏమైందని సమాచారహక్కు చట్టంద్వారా ఎవరో అడిగారు. సమాచారం పొందారు. ఆ వివరాలు పట్టుకొని టి ఆర్ పి గోదారి ఈదాలని అన్ని ఛానళ్ళు ప్రయత్నించాయి. ఛానళ్ళు గోలచేసి, గాలికి వదిలివేసిన విషయాలు బోలెడు. ఛానళ్ళకు రాజకీయ అవసరాలు, వాణిజ్య ప్రయోజనాలుంటాయి. అవి అంతర్గతంగా ఉన్నా, వీక్షకులకు సులువుగా దొరికిపోతుంటాయి కూడా. మిగతా విషయాలను యజమానులు డెస్క్కు వదిలివేస్తారు. వారికి ఏది కావాలనుకుంటే అదే చర్చ.
ఆ మధ్య వి.హనుమంతరావు గురించీ, కాంగ్రెస్ గురించి చాలా దూకుడుగా టీవీ-5 మాస్ మల్లన్న విసుర్లు సాగాయని ‘టీవీక్షణం’ విమర్శించింది కూడా ! హాస్యం కోసమో, టిఆర్పిలు కోసమో కంట్రోలు తప్పి కామెంట్లు చేయకూడదు. లేకపోతే ఇటీవల వాసవీమాత గురించి అర్థరహితంగా మాట్లాడినట్టు పేలి ఇబ్బందుల్లో పడతారు. మామామియా ఎందుకో ఇటీవల నోరు మూసుకున్నారు. కారణం తెలీదు. నా వార్తలు నా ఇష్టం కాదు, మీ ఇష్టం అనుకున్నారేమో – ఇటీవల ఈ కార్యక్రమం కట్టేశారు.
నిజానికి వార్తాఛానళ్ళ తిప్పలు పడేది వార్తల బాధితుల చుట్టూతానే ! నేరాలు-ఘోరాలు అనే ప్రోగ్రాంతో ఛానల్ పాపులారిటీ పెరిగిపోయింది. చివరకు ఆ కార్యక్రమం ఆపివేయవలసి వచ్చింది. దీన్ని చూసి మరో ఛానల్ మరోరకంగా సాగింది. మళ్ళీ ఇలాంటి ధోరణి మొదలైందా? రాత్రి 9.30కు టివి9 టాస్క్ఫోర్స్ అని క్రైమ్ కథనం వేస్తే, ఎన్టీవీ పదిన్నరకు ఇది కథ కాదు అంటూ నేరాధారిత వార్తాకథనం వేస్తోంది. ఇంకో ఛానల్ రెడ్ అలర్ట్ అంటోంది.
బిత్తిరిసత్తి తీన్మార్ వార్తలనుంచి తప్పిపోతే, ముగ్గురు మహిళలు మాత్రమే మిగిలారు. రక్తి కట్టడం ఏమోగాని, విసుగు మాత్రం కలుగుతోంది. మామామియా ఆగిపోవడం కూడా ఛానల్కు, ఛానల్ వీక్షకులకు మంచిదే ! ఈ దిశలో చాలా ఛానళ్ళు చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏబిఎన్ ఛానల్ ‘మిస్టర్ మెట్రో’ అనే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు. ఇదెలా సాగుతుందో చూడాలి.
తెలంగాణా రాష్ట్రానికి కొత్త గవర్నర్ తమిళ్ ఇసై వచ్చారు. ఈవిడ అక్కడ (తమిళనాడు) రాష్ట్ర బిజెపి అధ్యక్షులుగా పనిచేశారు. ‘ఇసై’ అంటే తమిళంలో సంగీతం. అయితే తెలుగు ఛానళ్ళు ఒక గంటా, గంటన్నరపాటు తమిళసాయి సౌందరరాజన్ అని హడావిడి చేశాయి. తమిళ రాజకీయాలు కాస్త పరిచయం ఉన్నవారు కూడా ఎవరువీరు? అనే సందేహానికి లోనయ్యారు. టీవీలో ఆమె ఫోటో కనబడేదాకా బోధపడలేదు !
ఛానళ్ళ చిత్రాలు భలే !
– డా.నాగసూరి వేణుగోపాల్