నాలుగు వారాల క్రితం లోక్సభ ఎన్నికలు, వాటితో పాటు కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల షెడ్యూలు ప్రకటించగానే తెలుగు వార్తా ఛానళ్లలో రకరకాల విమర్శలు ప్రసారమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తొలివిడతలోనే ఎందుకంటూ ఒక పార్టీకి అనుకూలంగా టివి ఛానళ్లు చర్చకు తెర తీశాయి. పత్రికల్లో ఈ చర్చ పెద్దగా రాజుకోక ముందే ముగిసింది. కానీ నేడు ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఛానళ్ల తీరు ఏమిటో చెప్పలేకున్నారు. నిజానికి తొలి విడతలో పోలింగ్ మంచిదే; ఈ గోల త్వరగా ముగుస్తుందని అందరూ భావించే పరిస్థితి తయారైంది.
మరీ మూడు నాలుగు రోజులుగా జుగుప్సాకరమైన రీతికి ఆరోపణలు చేరుకోగా మరింత అసంగతమైన రీతికి సర్వేలు చేరాయి. టివి5లో లక్ష్మీపార్వతి మీద ఆరోపణలతో ఒక లైవ్ కార్యక్రమాన్ని యాంకర్ మూర్తి నిర్వహించారు. ఒక ఛానల్కి సంచలనాలు ఎలా లభిస్తాయో చూస్తే అందరికీ అశ్చర్యం కలుగుతుంది. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన కేవలం మహాటివిలోనే నడవడంతో ఆ ఛానల్ విశ్వసనీయత అప్పట్లో ప్రశ్నార్ధకమైంది. ఇప్పుడు అలాంటివే సదరు జర్నలిస్టు ద్వారా మరో ఛానల్లో జరగడం ఆ జర్నలిస్టుకే ఇబ్బందికరంగా మారింది. ఇది టివి5 వ్యవహారం కాగా, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి సర్వే ఫలితాలంటూ టిడిపికి మొగ్గు ఉన్నట్లు ప్రకటించడం ఇంకో తతంగం. ఏ సంస్థ అయితే సర్వే నిర్వహించిందని ఈ టివి ఛానల్ ప్రకటించిందో ఆ సంస్థ దానిని ఖండించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోఎన్నికల కవరేజిలో చాలా స్పష్టంగా తేడా కనబడుతోంది. వారం క్రితం తెలంగాణాలో ప్రధాని పర్యటించేదాకా తెలంగాణ గురించి ఛానళ్లకు వేడి పుట్టలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదలైన తెలంగాణ ఛానళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకే ప్రాధాన్యత నివ్వడం బాగా గమనించవచ్చు. తెలంగాణ శాసనసభకు ఎన్నికలు ముందే జరగడం ఒక కారణం కావచ్చు. రెండవది తెలంగాణ విషయంలో జర్నలిస్టులు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు; మాట్లాడుతున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినపుడు రజనీకాంత్ వంటి యాంకర్లు చర్చలలో అడ్డు తగలడం, మధ్యమధ్యలో మసాలా అందివ్వడం పరిపాటి అయింది. ఈ తేడా ఎందుకు? ఇది యాంకర్లలోనే కాదు, మొన్న ఎల్బి స్టేడియంలో పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా గమనించాం. ఆంధ్రప్రదేశ్లో ఉద్రేకంగా మాట్లాడిన పవర్ స్టార్ హైదరాబాద్లో అనునయంగా మాట్లాడడం టివి ప్రత్యక్ష ప్రసారాల్లో గమనించాం. అలిఖత నియంత్రణో, అప్రకటిత స్వాతంత్ర్యమో రెండు రాష్ట్రాల సరిహద్దు రేఖ మీద ఉంటోంది. దీనిని చర్చించేవారు ఎవరు? దానికి వేదిక ఏది?
ఎన్నికల ప్రచారాలు ఎగిసే కొద్దీ న్యూస్ ఛానళ్ల కార్యక్రమాలూ వాటి పేర్లూ అలాగే ఉండి అరగంటకు మించి ప్రత్యక్ష ప్రసారాలు సాగుతున్నాయి. ఉదాహరణకు ‘టు స్టేట్స్’ అనే పేరు కార్యక్రమానికి ఉంటుంది. కానీ అరగంట చంద్రబాబు ప్రసంగం ప్రసారమవుతుంటుంది. ఎన్టివి, టివి9, టివి5, మహాటివి, ఈటివిల్లో టిడిపి ప్రచారం ప్రత్యక్ష ప్రసారం సాగుతుంటోంది. సాక్షి టివిలో జగన్మోహన్ రెడ్డి లేదా విజయమ్మ, లేదా షర్మిల ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారం అవుతుంటాయి.
ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈటివిలో న్యూస్ బులిటన్లు అనవసర విషయాలు తక్కువగా కంపాక్టుగా ఉంటాయి. దూరదర్శన్ బులిటన్లు మరింత గంభీరంగా, సంచలనాలకు అతీతంగా సమాచారంతో నిండి ఉంటాయి. అయితే ఈటివి కూడా ఎన్నికల సమయంలో మధ్యమధ్యలో బులిటన్లు అర్ధంతరంగా ఆపి టిడిపి ప్రచారసభల ప్రత్యక్ష ప్రసారం తరచూ ఇచ్చింది. ప్రతిపక్ష పార్టీకి అలా అవకాశం ఇచ్చిన సందర్భాలు లేవు, లేదా చాలా తక్కువ. జనసేనతో కలిపి ఈ మూడు పార్టీల ప్రచారసభల ప్రత్యక్ష ప్రసారం గురించి ఒక విషయం చెప్పుకోవాలి. మూడు పార్టీల అధినేతలలో చంద్రబాబు వయస్సులో పెద్దవారు. ప్రసంగించేటప్పుడు కాలర్ మీద మైక్ ఆయనకు చాలా సౌలభ్యంగా మారింది. పవన్ సభలలో చాలాసార్లు ఆడియో క్వాలిటీ అధ్వాన్నంగా మారింది. సినిమా రంగానికి చెందిన పవన్ ఈ విషయం గమనించనే లేదు. ఇది టివి వీక్షకులకు సమస్య అనేది అలా ఉంచితే అసలు సభల ప్రత్యక్ష ప్రసారం ఉద్దేశ్యమే దెబ్బ తిన్నట్లు కదా!
ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ టివి న్యూస్ ఛానళ్ల యుద్ధంగా మిగిలిపోయింది. వార్తలు ఇవ్వడం ఆపి వార్తా సంఘటనలు సృష్టించుకునే రీతిలో ఛానళ్లు సాగడం కీలకమైన పోకడ. సర్వేలు నిర్వహించి వాటి మీద రోజంతా చర్చలు చేయడం, లేదా విజయసాయి రెడ్డి ఆడియో, లక్ష్మీపార్వతి మీద అభియోగం వంటి వాటి నేపధ్యంలో సంచలనాత్మకంగా సాగిపోవడం. సోమవారం సాయంత్రం టివి5 సర్వే వార్తాంశమవుతోంది. మంగళవారం సాయంకాలానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం సద్దుమణుగుతుంది. పిమ్మట తెలుగు న్యూస్ ఛానళ్ల దిగజారుడు బల్లల నిడివిని మనం కొలుచుకుని మరింత విషాదంలో మునగవచ్చు. మే నెల మూడోవారం ఈ టివి ఛానళ్ల హడావుడికి రాలిన వోట్లు ఏమిటో తెలుసుకోవచ్చు.
-నాగసూరి వేణుగోపాల్