అమరావతి : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖపై కేంద్ర మంత్రి జైశంకర్ స్పందించి తిరిగి లేఖ రాశారు. కరోనా వైరస్ ప్రభావంతో చైనా అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో వూహాన్లో ఉన్న అన్నెం జ్యోతి, టి.సత్యసాయి కృష్ణను స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర మంత్రి జైశంకర్కు చంద్రబాబు లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి.. జ్యోతి, సత్యసాయి ఆరోగ్య పరిస్థితిపై బీజింగ్లోని భారత రాయబార అధికారులు తెలుసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆ ఇద్దరికి తీవ్రమైన జ్వరం ఉందని అధికారులు తెలిపారన్నారు. జ్యోతి, సాయికృష్ణ, కుటుంబసభ్యులు, వూహాన్లో ఉన్న వైద్యులతో ఎంబసీ అధికారులు టచ్లో ఉన్నారని జయశంకర్ లేఖలో తెలిపారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులకు సూచించామనీ తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తూ ఉంటామని చంద్రబాబుకు రాసిన లేఖలో జైశంకర్ వివరించారు.
previous post
next post