(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్లుగా తయారైంది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి. ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధి నిర్వహణలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులను కలవడంతో ఇంకేముంది వైసీపీ.. ఎన్ డి ఏ గూటికి చేరిపోతుందంటూ తెలుగు నాట విస్తృతంగా ప్రచారం జరిగింది.
ప్రధానంగా మండలి రద్దు, విభజన హామీల అమలు, దిశ చట్టం, పోలవరం ప్రాజెక్టు కు నిధులు తదితర విషయాలపై చర్చించేందుకు జగన్ కేంద్ర పెద్దలను కలిసిన విషయం తెలిసిందే. జగన్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జెపి నడ్డాను, ఆ పార్టీ ముఖ్య నేతలను అసలు కలుసుకొనే లేదు. ప్రతి పక్ష పార్టీలకు ముఖ్యమంత్రులైనా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో సన్నిహిత సంబంధాలు మెయింటెన్ చేస్తుంటారు. అయినంత మాత్రాన వారి పార్టీతో కలిసి నట్లు భావించాల్సిన అవసరం లేదు.
ఇదే విషయాన్ని బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ డియోధర్ వెల్లడించారు. ‘వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందని టీడీపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనే లేదు. జనసేనతో ఇప్పటికే బీజేపీ పొత్తు పెట్టుకుంది. రానున్న స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పనిచేస్తాం. రాష్ట్రాల అభివృద్ధి విషయంలో కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. నిజానికి రాజ్యసభలో మాకు బలం లేదు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో వైసీపీ, టీడీపీ, బిజూ జనతాదళ్ పార్టీలు మాకు మద్దతు ఇచ్చాయి. అంత మాత్రన వైసీపీతో పొత్తు పెట్టుకున్నామని కాదు. ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు పొలిటికల్ ఫైట్ మాత్రమే’అని సునీల్ దేవధర్ పేర్కొన్నారు.