ఉమ్మడి కృష్నా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వద్దన్నా.. టీడీపీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీకి వైసీపీ టికెట్ ఇవ్వడాన్ని ఇక్కడి నాయకులు జీర్ణించు కోలేక పోతున్నారు. దీంతో వారంతా కొంప ఖాళీ చేసేస్తున్నారు. కనీసం టీడీపీ నుంచి ఎలాంటిపిలుపు లేక పోయినా.. నేరుగా వచ్చి.. తలుపుతట్టి మరీ యార్లగడ్డకు జై కొడుతున్నారు. దీంతో గన్నవరం వైసీపీ మొత్తం ఎన్నికల పోలింగ్ సమయానికి ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు. అయితే.. ఇంత జరిగినా.. ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్నేత వంశీ మాత్రం మౌనంగా ఉన్నారు. దీనిని బట్టి ఆయన చేతులు ఎత్తేశారనే వాదన వినిపిస్తోంది.
తాజాగా గన్నవరం నియోజకర్గంలోని నాలుగు మండలాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకు లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరిపోయారు. అయితే.. వీరేమీ సాదా సీదా నాయకులు కారు. వందల సంఖ్యలో ఓటర్లను ప్రభావితం చేయగల నాయకులు కావడం గమనార్హం. మాల మహానాడు ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు వీరబత్తిన అమల్ దాస్ యార్లగడ్డకు జై కొట్టారు. ఆయన ఆధ్వర్యంలో 400 మంది పార్టీలో చేరారు.
మాల మహానాడు అధ్యక్షులు వీరాబత్తిన అమలదాసు పేరు జిల్లా వ్యాప్తంగా సుపరిచితం. అందరివాడు, అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గలో 35 వేలకు పైగా మాలల ఓటు బ్యాంకు ఉంది. దీనిని ఆయన ప్రభావితం చేయగలవాడిగా కూడా ప్రచారం జరుగుతోంది. యార్లగడ్డ వెంకట్రావు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని ఆయన చెప్పడం గమనార్హం. చిత్రం ఏంటంటే.. నిన్న మొన్నటి వరకు ఈయన వైసీపీకి అండగా ఉన్నారు.
ఇక, పోలిమెట్ల బాలకృష్ణ( గన్నవరం నియోజకవర్గ మాల సంఘం అధ్యక్షుడు) కూడా పార్టీలో చేరిపోయా రు. ఈయనతోపాటు ఉయ్యాల మరియమ్మ(కృష్ణా జిల్లా మహిళా జనరల్ సెక్రెటరీ), తలారి ఏసుపాదం (గన్నవరం నియోజకవర్గ ఉపాధక్షుడు), తలారి జేమ్స్ (బాపులపాడు మండల అధ్యక్షుడు), ఇలపర్తి సోమయ్య (బాపుల పాడు మండల ఉపాధ్యక్షుడు), బేతపూడి దానియేలు(కృష్ణా జిల్లా మాలసంఘం సెక్రటరీ), దోమవరపు. బాబురావు (రంగన్న గూడెం గ్రామ అధ్యక్షుడు) ఇలా అనేక మంది చీమల దండులా వచ్చి.. యార్లగడ్డకు జై కొట్టారు.