కరోనా వచ్చి 2020 సినిమా క్యాలెండర్ మొత్తాన్ని మార్చేసింది. భారీ బడ్జెట్ సినిమాలు ఓపక్క.. పాన్ ఇండియన్ సినిమాలు మరోపక్క. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈ సినిమాలను సమ్మర్ రలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఆర్ఆర్ఆర్ మూవీ 2021 సమ్మర్ రిలీజ్ అనే వార్తల నేపథ్యంలో మిగిలిన భారీ సినిమాలన్నీ పోటీగా రాబోతున్నాయని అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘ఆచార్య’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడంతో నవంబర్ 10న ప్రారంభమైన షెడ్యూల్ లో ఆయన లేని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని కూడా సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తున్నారు. బందిపోటు తరహా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా జరిగింది. ఏఎం రత్నం నిర్మాత. ఈ సినిమా కూడా సమ్మర్ రిలీజ్ అనుకుంటున్నారు. పవన్ చేయబోయే మళయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’ తెలుగు రీమేక్ కూడా త్వరలో ప్రారంభించి సమ్మర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
రాధకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న రాధే శ్యామ్ ఇటీవలే ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. బ్యాలెన్స్ ఉన్న టాకీ పార్ట్, పాటలను ఇక్కడే చిత్రీకరిస్తారని అంటున్నారు. అన్ని పనులు పూర్తి చేసి ఈ సినిమాను 2021 వేసవికి విడుదల చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్టు సమాచారం. యూవి క్రియోషన్స్, గోపీకృష్ణ మూవీస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా నిర్మిస్తోంది మైత్రీ మూవీస్ బ్యానర్. అయిదు భాషల్లో రిలీజ్ కాబోతోంది. నవంబర్ 10 నుంచి షూటింగ్ మొదలైంది.
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. త్వరలో షూటింగ్ ప్రారంభించి సమ్మర్ కే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇలా పెద్ద సినిమాలను సమ్మర్ కు ప్లాన్ చేస్తూండటంతో ‘ఆర్ఆర్ఆర్’కు సమాంతరంగా రిలీజ్ చేస్తారని అంటున్నారు. వీటన్నింటిపై పూర్తి క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.