(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో ఐఏఎస్లు జాగ్రత్తగా ఉండాలని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హితవు పలికారు. వైఎస్ హయాంలో జగన్, విజయసాయిరెడ్డి మాటలు విని సంతకాలు పెట్టిన పలువురు అధికారులు చంచల్గూడ జైలుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు అధికారులు సంతకాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపిలో పోస్టింగ్ కోసం ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ ఇప్పటికీ ఢిల్లీ చుట్టూ తిరుగుతోందని తెలిపారు. ప్రభుత్వ ప్రతి నిర్ణయంపై సిబిఐ విచారణ జరుగుతుందనీ, కావున అధికారులు తొందరపడి జివోలపై సంతకాలు పెట్టవద్దని ఉమా సూచించారు. తెలివితక్కువ వాడికి రాష్ట్రాన్ని అప్పగిస్తే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. వైసిపి ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై ఉన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేస్తున్నా మార్పు రావడం లేదని ఉమా అన్నారు.