అధికార వైసీపీలో ఒక సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలో వైసిపిని పటిష్టం చేసే బాధ్యతను పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి అప్పగించారు.
ప్రకాశంతో పాటు కర్నూలు జిల్లా బాధ్యతలను కూడా వేమిరెడ్డికి ఇస్తూ పార్టీ రాష్ట్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది.ఇంతకు ముందు ప్రకాశం జిల్లా పార్టీ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కివ్వడం జరిగింది.అయితే వారం తిరిగేలోపే జిల్లా ఇంచార్జి మారడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది.నెల్లూరు జిల్లాకు చెందిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి ప్రకాశం జిల్లా పక్కన ఉంటుంది కాబట్టి ఈ బాధ్యతలు అప్పగించారని భావిస్తున్నప్పటికీ అకస్మాత్తుగా సజ్జల నెందుకు తప్పించారో ఎవరికీ అంతుపట్టడం లేదు.
ఇ౦తకుముందు కూడా సజ్జలే ప్రకాశం జిల్లా పార్టీ బాధ్యతలు చూశారు.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అతి సన్నిహితునిగా పేరున్న సజ్జల నుండి ఒక జిల్లాను తప్పించడమనేది పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.ఏ కారణాల వల్ల పార్టీ అధినేత జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న విషయంపై రాజకీయ పరిశీలకులు అన్ని కోణాల నుండి ఆరా తీస్తున్నారు.మొత్తానికి ఏదో బలమైన కారణం ఉండే సజ్జలను తప్పించారని మాత్రం విశ్లేషణ సాగుతోంది అదేమిటో త్వరలోనే తెలుస్తుంది.