అమరావతి:మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై వివిధ కధనాలు వచ్చిన నేపథ్యంలో అనుమానాలు నివృత్తికి తెలంగాణ పోలీస్ యంత్రాంగం సమగ్ర దర్యాప్తు జరపాలని ఏపి పట్టణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ బొత్సా సత్యనారాయణ కోరారు.
కోడెల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బొత్స కోడెల కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. శివప్రసాద్ మరణంపై వార్తలు క్షణక్షణం మారుతూ వచ్చాయన్నారు. తొలుత గుండెపోటు అని, తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారనీ మళ్ళీ వెంటనే గతరాత్రి ప్రమాదకరమైన ఇంజక్షన్ వేసుకున్నారనీ ఇలా రాక రకాలుగా వార్తలు ప్రసారం అయ్యాయని బొత్స పేర్కొన్నారు. సీనియర్ రాజకీయ నాయకుడి మరణంపై పలు కథనాలు వస్తున్నప్పుడు వాటిపై సమగ్ర విచారణ జరగాలని బొత్స అన్నారు. ఈ మేరకు తెలంగాణా ప్రభుత్వాన్ని కోరుతున్నామని బొత్స చెప్పారు. సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలని బొత్స కోరారు.
కోడెలకు ఏది జరిగినా దగ్గరలోనే నిమ్స్ వంటి ప్రముఖ ఆసుపత్రులు ఉండగా వీటిని కాదని ఆయన్ను బసవ తారకం కాన్సర్ ఆసుత్రికి తీసుకువెళ్లడం పట్ల సందేహాలు వ్యక్తం అవుతున్నాయని బొత్స అన్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు కోడెల మరణంపై శవరాజకీయాలు చేస్తున్నారని బొత్స విమర్శించారు. ప్రభుత్వ వత్తిడి వల్లే ఉరివేసుకున్నారంటూ తప్పుడు ప్రచారం చేసున్నారని బొత్స మండిపడ్డారు.
ప్రభుత్వం కోడెలపై ఏనాడు వత్తిడి తేలేదనీ, కావాలని కేసులు పెట్టలేదనీ బొత్స స్పష్టం చేశారు. కోడెల వల్ల నష్టపోయిన వారు పోలీసులను ఆశ్రయించడం వల్లే కేసులు నమోదు అయ్యాయని బొత్స చెప్పారు.