అమరావతి: ఏపీ రాజధాని మార్పుపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ తెరపైకి తెచ్చిందని ఆయన ఆరోపించారు. మంగళవారం విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు చేపట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్షలో చింతమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులందరూ త్యాగాలు చేసి అమరావతి రాజధానికి ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చారని గుర్తు చేశారు. అంతేగానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతులు భూములు ఇవ్వలేదన్నారు. రాజధానిపై ఏర్పాటు చేసిన కమిటీలన్నీ జగన్ రాసిచ్చిన స్క్రిప్టులే చదువుతున్నాయని విమర్శించారు. అమరావతి నిర్మాణం చేసి తీరాలని, రాజధానికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రజావేదికను కూల్చడంతోనే అమరావతిపై జగన్కు ఉన్న కోపాన్ని తెలిపిందని పేర్కొన్నారు.
‘ఒక అమ్మ, అబ్బకి పుట్టినవాడు ఎవడైనా అమరావతి రాజధాని మార్పును కోరుకోడు’ అని చింతమనేని ఘాటుగా వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని తరలింపు 29 గ్రామాల సమస్య కాదు.. రాష్ట్ర సమస్య అని తెలిపారు. అమరావతి నుంచి రాజధానిని మార్చడం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడమేనని చెప్పారు. జగన్ ఇంటి పేరు రివర్స్ అని పెట్టుకుంటే బాగుంటుందన్నారు. జగన్ ఉన్మాది, అహంకారి, దుర్మార్గుడు అనే భావన ప్రజలలో నెలకొందన్నారు. రానున్న రోజుల్లో జగన్కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చింతమేని హెచ్చరించారు.