(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అనంతపురం: తాము టిడిపిలో ఉన్నామన్న కక్షతోనే ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని టిడిపి నేత, తాడిపర్తి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి ఆరోపించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులను మరో సారి రవాణా శాఖ అధికారులు సీజ్ చేయడంతో ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇతర ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసిన రెండవ రోజే అధికారులు రిలీజ్ చేస్తున్నారనీ, తమ దివాకర్ ట్రావెల్స్ బస్సులను మాత్రం రిలీజ్ చేయడం లేదనీ ఆయన అన్నారు. స్థానిక అధికారులు తమ బస్సులను సీజ్ చేయడానికి నిరాకరిస్తున్నారని చిత్తూరు జిల్లా నుండి అధికారులను రప్పించి మరీ బస్సులను సీజ్ చేయిస్తున్నారని ప్రభాకరరెడ్డి అన్నారు. ఎవరి బతుకులు ఏమిటో తమకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలోనే తమ కుటుంబం కార్లలో తిరిగిందని చెప్పుకొచ్చారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదని ప్రభాకరరెడ్డి అన్నారు.