అమరావతి: రైతు సమస్యల పరిష్కారం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘రైతు సౌభాగ్య దీక్ష’ కార్యక్రమానికి ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హాజరు కాలేదు. పార్టీ అధినేత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దీక్షకు రాపాక హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన రాలేదని పార్టీ నేతలు చెబుతున్నారు.
మరోవైపు రాపాక పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. రాపాక అధికార పార్టీకి దగ్గర అయ్యేందుకు ఉత్సాహం చూపుతున్నారని, త్వరలోనే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు బదులు కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ప్రవేశపెట్టడంపై పవన్ కల్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, రాపాక మాత్రం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన సంగతి తెలిసిందే. పేద విద్యార్థుల కోసం వైసిపి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందంటూ కితాబు ఇచ్చారు. జనసేన అధినేత నిర్ణయానికి విరుద్ధంగా ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక ప్రభుత్వ చర్యలను అసెంబ్లీలో సమర్థించడం జనసేన శ్రేణులను అయోమయానికి గురి చేసింది.
ఇదిఇలా ఉంటే.. తనకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. అయితే తమ మధ్య ఉన్న గ్యాప్ త్వరలోనే తొలిగిపోతుందని భావిస్తున్నట్టు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం లేకపోతే ఉన్న ఇబ్బందుల తనకు తెలుసని, చాలా మంది దళితులు పైవేటు పాఠశాలలో చదవలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని తాను స్వాగతించానని వివరించారు. తనలాగే పార్టీకి సంస్థాగత నిర్మాణం చేసి ఉంటే జనసేన అభ్యర్థులు గెలిచేవారేమోనని రాపాక వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలుపు కోసం తాను నియోజకవర్గంలో కమిటీలు ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు.