అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నాలుగో రోజు సభ ప్రారంభం కాగానే ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతూ ప్లకార్డులతో వెళ్తుండగా వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. సెక్యూరిటీ తీరును తీవ్రంగా నిరసించిన చంద్రబాబు, ఎమ్మెల్యేలు… అసెంబ్లీ ముందు బైఠాయించారు. అనంతరం ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రస్తావించారు. అసెంబ్లీ దగ్గర మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారని అన్నారు. ప్లకార్డులు, బ్యానర్లు, నల్ల రిబ్బన్లు వద్దంటున్నారని.. చివరికి కాగితాలు కూడా తీసుకెళ్లనీయడం లేదని బాబు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలపై చేయి వేసి తోసేశారన్నారు. ఎమ్మెల్యేను అవమానించినవారిని కఠినంగా శిక్షించాలని.. గతంలో ప్లకార్డులు తీసుకొచ్చి సభలో వైసీపీ ఎమ్మెల్యేలు యుద్ధవాతావరణం సృష్టించారని చంద్రబాబు గుర్తు చేశారు. చీఫ్ మార్షల్ను పిలిపించి మాట్లాడాలని.. లేదంటే సభలో ఉండేది లేదన్నారు. చీఫ్ మార్షల్పై చర్యలు తీసుకోకుంటే అసెంబ్లీలో ఉండలేం వ్యాఖ్యానించారు. సభా మర్యాదలు కాపాడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తనపై సీఎం జగన్ కావాలని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పులివెందుల పంచాయితీ అసెంబ్లీలో పనిచేయదని, అది ఇక్కడ అవసరం లేదని చెప్పారు.