అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ను వైదొలగమని చెబితే దేవినేని ఉమా ఎందుకు ఉలిక్కి పడుతున్నాడని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వైసిపి నేత విజయసాయిరెడ్డి, టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. శనివారం ట్విట్టర్ వేదికగా దేవినేని ఉమాను విజయసాయిరెడ్డి విమర్శించారు.
‘పోలవరం కాంట్రాక్టర్లను వైదొలగమని చెబితే దేవినేని ఉమా ఎందుకు ఉలిక్కి పడుతున్నావు? ప్రాజెక్టు పనులన్నిటినీ బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించి వేల కోట్ల కమీషన్లు దండుకున్నారు కదా. అడ్డంగా దొరికిన తర్వాత ఇది పులివెందుల పంచాయతీలా అనిపిస్తోందా?’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
దీనిపై దేవినేని ఉమా స్పందిస్తూ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డిపై విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి షెకావత్ సంధించిన ప్రశ్నలకు సిఎం జగన్ సమాధానం చెబుతారా అని ఉమా ప్రశ్నించారు. విజయసాయిరెడ్డికి దమ్ముంటే కేంద్ర మంత్రి షకావత్ చేసిన వ్యాఖ్యలపై ట్వీట్ చేయాలని ఉమా డిమాండ్ చేశారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధి బాధ్యతలు నిర్వహిస్తున్న విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి లోక్సభలో మాట్లాడిన మాటలకు సిగ్గుపడాలని అని ఉమా పేర్కొన్నారు.
పరిగెత్తే ప్రాజెక్టుకు కాలు అడ్డం పెట్టారనీ, దానికి తాము బాధపడుతున్నామని ఉమా అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కనీసం సమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద పోటెత్తుతున్న తరుణంలో వాటిని పర్యవేక్షించకుండా నిర్మాణ సంస్థను బయటకు రావాలని చెప్పడం వెనుక వారి దుర్మార్ఘమైన ఆలోచన ఏమిటని ఉమా ప్రశ్నించారు. పవర్ ప్రాజెక్టు కోసమే పోలవరం టెండర్ను రద్దు చేశారని ఉమా ఆరోపించారు. ఇంకా బాధ్యత లేకుండా విజయసాయిరెడ్డి తమపై ట్వీట్లు చేస్తున్నారని ఉమా విమర్శించారు.