లక్నో: ఉన్నావ్ అత్యాచార ఘటనలో నిందితుడుగా ఉన్న ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెనగర్కు మద్దతుగా ఒక బిజెపి ఎమ్మెల్యే ప్రసంగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం ఉన్నావ్ అత్యాచర ఘటనలో నిందితుడైన ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెనగర్ బిజెపి సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఉన్నావ్ సమీపంలోని ఒక గ్రామంలో జరిగిన సభలో బిజెపి ఎమ్మెల్యే అశీష్ సింగ్ ఆశు మాట్లాడుతూ ‘మన సోదరుడు కులదీప్ సింగ్ ఈ రోజు మన మధ్య లేరు. ఆయన చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. మన మద్దతు ఆయనకు ఎప్పుడూ ఉంటుంది. అన్ని అడ్డంకులను ఎదుర్కొని త్వరలోనే మన మధ్యకు వస్తారని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
ఒక నేరపూరిత కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి అధికార పార్టీ ఎమ్మెల్యే మద్దతు నిలవడం ఏమిటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.
ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడుగా జైలులో ఉన్న కులదీప్ సింగ్పై బాధితురాలు, వారి కుటుంబ సభ్యుల హత్యకు కుట్రపన్నారన్న అభియోగంపైనా కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం ఈ కేసు సిబిఐకి అప్పగించారు. దర్యాప్తు వేగవంతం చేసిన సిబిఐ అధికారులు శనివారం సీతాపూర్ జిల్లా జైలుకు వెళ్లి కులదీప్ సింగ్ను విచారించారు. జైలులో ఉన్న కులదీప్ను కలవడానికి వచ్చిన వారి జాబితాను సిబిఐ అధికారులు కోరారు. వారంలోగా రోడ్డు ప్రమాదం కేసు, 45రోజుల్లో అత్యాచార కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో దర్యాప్తును వేగవంతం చేశారు.
మరో పక్క నిందితుడు కులదీప్సింగ్కు ఉన్న ఆయుధాల లైసెన్సులను శనివారం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. సింగిల్ బ్యారెల్ గన్, రైఫిల్, రివాల్వర్ల లైసెన్సులు ఆయనకు ఉన్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు జిల్లా న్యాయమూర్తి శుక్రవారం ఆయుధ లైసెన్సు రద్దు చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.