ముంబై: భారతీయులకు బంగారం అంటే ఆసక్తి ఎక్కువ. పండగలు, శుభకార్యాలకు బంగారం కొనడం భారతీయులకు అలవాటుగా వస్తోంది. ధనత్రయోదశి నాడు బంగారం కొనడం అనే సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. ధనత్రయోదశి వంటి రోజుల్లో బంగారం కొనుగోలు చేసి, ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కొందరు విశ్వసిస్తారు. ఆ విశ్వాసం బంగారం అమ్మకాలపైనా ప్రభావం చూపిస్తుంది. అక్షయ తృతీయ, ‘ధన్తెరాస్’ వచ్చాయంటే ఇక పుత్తడి విక్రయాలు జోరందుకుంటాయి. కొనుగోలుదారులతో దుకాణాలు కిక్కిరిస్తుంటాయి. పండుగ సీజన్లో దుకాణ యజమానులు కూడా భారీ ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తుంటారు.
ఈ ఏడాది ‘ధన్తెరాస్’ పర్వదినం సందర్భంగా బంగారం అమ్మకాలు 30 టన్నులకుపైగా ఉందని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీ సురేంద్ర మెహతా తెలిపారు. గత కొన్నేళ్లుగా ధనత్రయోదశి వంటి రోజుల్లో బంగారం అమ్మకాలు 40 టన్నుల వరకూ ఉండేవని, కానీ ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరగడంతో కేవలం 20 టన్నుల బంగారం అమ్మకాలు జరుగుతాయని భావించినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను బట్టి అంచనా వేస్తే.. ఈ ఏడాది ధనత్రయోదశికి గతేడాదితో పోలిస్తే బంగారం కొనుగోళ్లు 25 శాతం వరకూ తగ్గాయని ఆయన తెలిపారు. అధిక ధరల కారణంగా దేశీయ మార్కెట్లో బంగారం డిమాండ్ తగ్గినందున తాము అంత అమ్మకాలును ఊహించలేదని సురేంద్ర మెహతా చెప్పారు.
ప్రస్తుతం ఉన్న కమోడిటీ అనలిస్ట్ల అంచనా ప్రకారం.. బంగారం ధర తగ్గే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. పైగా గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే బంగారం ధర ఏడు వేల రూపాయల మేర పెరిగింది. ఒక్క ఏడాదిలో బంగారం ధర ఇలా పెరగడం ఎప్పుడూ లేదు. ఇంతలా పెరిగిన బంగారం ధర ఈ ధనత్రయోదశి అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు అంటున్నారు. గతేడాది ధనత్రయోదశి నాటికి 31,702 రూపాయలున్న 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ ధర ఇప్పుడు భారీగా పెరిగింది. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర 38,275 రూపాయలుగా ఉంది.
బంగారం దిగుమతులపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో పెంచిన సంగతి తెలిసిందే. గతంలో 10 శాతంగా ఉన్న సుంకాన్ని 12.5 శాతానికి పెంచింది. ఈ పరిణామంతో బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో సాధారణ రోజుల్లో అమ్మకాలు భారీగా పడిపోయాయి. భారీగా ఉన్న బంగారం ధరలతో పెట్టుబడి పెట్టడానికి కూడా ఎవరూ సుముఖత చూపడం లేదని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో మార్కెట్లో బంగారానికి డిమాండ్ తగ్గిందని చెబుతున్నారు.