(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో సుమారు 200 మంది మహిళలు రెండు ఎకరాల్లో కారు గుర్తు ముగ్గు వేశారు. సంక్రాంతి పురస్కరించుకొని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు అయిన ‘కారు’ ముగ్గును వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేవలం మూడు గంటల్లోనే ఈ ముగ్గును సిద్ధం చేసి అబ్బురపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారీ కారు గుర్తు ముగ్గు వేయడం స్థానికులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘కారు’ గుర్తు ముగ్గును పట్టణవాసులు తండోపతండాలుగా వచ్చి వీక్షించారు. ఈ ముగ్గును వేసిన మహిళా కార్యకర్తలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Truly a visual treat.
A colorful gigantic Rangoli at Siricilla in over 2 acres.#VoteForCar #TRSSweepsMunicipolls @KTRTRS pic.twitter.com/t8Jts1EKpB— Jagan Patimeedi (@JAGANTRS) January 15, 2020
దీనికి సంబంధించి 1.20 నిమిషాల నిడివి గల ఓ వీడియోను టీఆర్ఎస్ కార్యకర్త ట్వీట్ చేశారు. ఓ రోడ్డు పక్కన నేలపై వేసిన ఈ భారీ కారు ముగ్గు బొమ్మ, ఆ వైపుగా వెళ్లేవారిని ఆశ్చర్యపరుస్తోంది. దీనికి సంబంధించిన డ్రోన్ చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. పక్కనే ఉన్న పెద్ద భవంతులు సైతం దీనిముందు చిన్నబోయాయి.