హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని దాఖలైన పిటిషన్లను కొట్టేసిన ధర్మాసనం.. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఎన్నికలను ఆగస్టు 15లోపే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ, తెలంగాణలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు హైకోర్టులో కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. రిజర్వేషన్లు, వార్డుల విభజనపై కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ ఎన్నికలపై గత మూడు నెలల నుంచి హైకోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు మంగళవారం(అక్టోబర్ 22) తుది తీర్పు ఇచ్చింది. నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
దీంతో రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల వాతావరణం రానుంది. హుజుర్నగర్ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ముగియగా.. మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలో మొత్తం 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మం కార్పొరేషన్ల పదవీ కాలం ఇంకా పూర్తి కాలేదు. దీంతో పది నగరపాలికలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు 128 మున్సిపాలిటీల్లో సిద్దిపేట, అచ్చంపేట పురపాలక స్థానాలు పదవీ కాలం పూర్తి కాలేదు. అంతేకాకుండా కొన్ని సమస్యల వల్ల మరో ఐదు పురపాలక స్థానాల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడలేదు. దీంతో త్వరలో రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయని తెలుస్తోంది.