న్యూఢిల్లీ: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వరుసగా రెండో రోజు కొనసాగుతోంది. మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అయితే సోమవారమే జగన్ .. అమిత్ షాను కలవాల్సి ఉండగా… పలు కారణాల వల్లే ఈ భేటీ మంగళవారానికి వాయిదా పడింది. దీంతో నిన్న రాత్రి ఢిల్లీలోనే బస చేసిన జగన్.. ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షాకు జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 40 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పెండింగ్ లో ఉన్న నిధులు, సమస్యలపై అమిత్ షాతో చర్చించినట్లు సమాచారం. ప్రత్యేక హోదా, రెవిన్యూలోటు కింద రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం, విభజన చట్టంలో హామీలు, వెనకబడ్డ జిల్లాలకు నిధులు, నాగార్జునసాగర్, శ్రీశైలంలకు గోదావరి వరదజలాల తరలింపుపై అమిత్షాతో సీఎం జగన్ చర్చించారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని జగన్ … అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్షాకు మరోసారి సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన పరిశ్రమలు, సేవారంగాలపై ప్రతికూల ప్రభావం చూపిందన్న సీఎం..వీటివాటా 76.2 శాతం నుంచి 68.2 శాతానికి తగ్గిందన్నారు. ప్రత్యేక హోదాద్వారానే ఈ సమస్యలను అధిగమించగలమని హోంమంత్రికి వివరించారు. చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు కాకుండా పరిశ్రమలు ఏపీ వైపు చూడాలంటే ప్రత్యేక తరగతి హోదా ఉండాలని కోరారు. 2014-2015లో రెవిన్యూలోటును కాగ్తో సంప్రదించి సవరిస్తామని గతంలో హామీ ఇచ్చారంటూ అమిత్షాకు గుర్తుచేసిన జగన.. ఆమేరకు సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో రూ.22948.76 కోట్లు రెవిన్యూ లోటుగా ప్రకటించినప్పటికీ ఇంకా రూ.18969.26 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి చెల్లించాల్సి ఉందని హోంమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నిధులను తక్షణమే విడుదల చేయాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికోసం రాష్ట్ర పునర్ విభజన చట్టంద్వారా కడపలో స్టీల్ప్లాంట్ నిర్మాణం అంశాన్ని పేర్కొన్న సీఎం… ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణ అంశాన్నికూడా ప్రస్తావించారు. వీటితోపాటు విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన నిధులను సమకూర్చాల్సిందిగా కోరారు.
అలాగే, వెనకబడ్డ జిల్లాలకు కేటాయించే నిధుల క్రైటీరియాను మార్చాలన్నారు. ఏపీలో వెనకబడ్డ జిల్లాల్లో తలసరి రూ.400 రూపాయలు ఇస్తే, బుందేల్ఖండ్, కలహండి ప్రాంతాలకు తలసరి రూ.4000 ఇస్తున్నారని చెప్పారు. ఇదే తరహాలో ఏపీలోని వెనకబడ్డ జిల్లాలకు ఇవ్వాలని కోరారు. ఏపీలో వెనకబడ్డ 7 జిల్లాలకు ఏడాదికి రూ. కోట్లు చొప్పున ఇప్పటివరకూ రూ.2100కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకూ రూ.1050 కోట్లుమాత్రమే ఇచ్చారని, మిగిలిన మొత్తాన్ని వెంటనే విడుదలచేయాలని తెలిపారు. ఇక పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాల ప్రకారం రూ. 55,548.87 కోట్లకు ఆమోదించాలని అమిత్షాకు విజ్ఞప్తి చేశారు. ఇందులో రూ.33వేలకోట్లు భూసేకరణ, ఆర్ అండ్ ఆర్కే ఖర్చు అవుతుందన్న సీఎం.. రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన రూ.5,073 కోట్లను వెంటనే విడుదలచేయాలని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియద్వారా రూ.838 కోట్ల ప్రజాధానాన్ని ఆదాచేశామని అమిత్షాకు తెలిపిన సీఎం జగన్… హెడ్ వర్క్స్, హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులో రూ.780 కోట్లు, టన్నెల్ పనుల్లో రూ.58 కోట్లు ఆదా అయిన విషయాన్ని వివరించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి వరదజలాల తరలింపు అంశాన్ని కూడా అమిత్షాతో చర్చించారు. కృష్ణానదిలో గడచిన 52 సంవత్సరాల్లో నీటి లభ్యత సగటున ఏడాదికి 1,230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయిందని తెలిపారు. మరోవైపు గోదావరిలో గడచిన 30 సంవత్సరాలుగా సగటున ఏడాదికి 2,780 టీఎంసీల జలాలు సముద్రంలోకి పోతున్నాయని చెప్పారు. కృష్ణా జలాలపై ఆధారపడ్డ రాయలసీమ, కృష్ణాడెల్టా సహా తాగునీరు, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాలకు గోదావరి వరదజలాలను నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించే ప్రాజెక్టును చేపట్టాల్సిందిగా సంబంధిత శాఖలను ఆదేశించాలని కోరారు. దీనివల్ల రాష్ట్రంలోని సాగునీరు, తాగునీరు కొరత ఉన్న ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని, ఆ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులు అనూహ్యంగా మారుతాయని వివరించారు.
ఇదిఇలా ఉంటే.. జగన్ ఢిల్లీ టూర్ పై పలు ఆసక్తికర వార్తలు తెర మీదకు వస్తున్నాయి. జగన్ తన వ్యక్తిగత అజెండా కోసమే కేంద్ర హోంమంత్రిని కలిశారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి గల కారణాలు కూడా లేకపోలేదు. అక్రమాస్తుల కేసులో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కోర్టుకు హాజరయ్యే విషయంలో తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే దీనికి సీబీఐ మాత్రం ససేమిరా అంటోంది. సీఎం అయినంత మాత్రాన మినహాయింపు లభించబోదని సీబీఐ స్పష్టం చేసింది. జగన్కు మినహాయింపు ఇస్తే, సాక్షులను ప్రభావితం చేస్తారని పేర్కొంది. అయితే కోర్టు వాయిదాలతో తన అధికారిక కార్యక్రమాలకు అడ్డంకి ఏర్పడుతుందని అందుకే తనకు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరుతున్నారు. అయితే, దీనిపై సీబీఐ మాత్రం పట్టు వదలడం లేదు. దీంతో సీబీఐ, కోర్టు కేసుల వ్యవహారంపై కేంద్ర హోంమంత్రిగా అమిత్ షాతో కలిసి చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.