అమరావతి: అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు నుండి ప్రపంచ బ్యాంకు వెనక్కు వెళ్లడానికి కారణం మీరంటే మీరని అధికార, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. బడ్జెట్పై చర్చలో భాగంగా ప్రపంచ బ్యాంక్ నిధులపై సోమవారం అసెంబ్లీలో శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వివరణ ఇచ్చారు.
గత టిడిపి ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని గుర్తించే ప్రపంచ బ్యాంక్ భయపడిందని బుగ్గన అన్నారు. 2017,2018 సంవత్సరాల్లో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అమరావతిలో పర్యటించిన సమయంలో ఇక్కడి రైతులు, ఎన్జివోలు అమరావతి అవినీతిపై ఫిర్యాదు చేశారని బుగ్గన తెలిపారు. అమరావతి ప్రాజెక్టుకు 3500కోట్ల రూపాయల రుణాన్ని నిలిపివేసిన ప్రపంచ బ్యాంకు తాజాగా అమరావతిలో మానవ వనరుల అభివృద్ధి ప్రాజెక్టుకు పూర్తి సహాయం అందిస్తామని తెలియజేసిందని బుగ్గన అన్నారు. అమరావతి విషయంతో గత తెలుగుదేశం ప్రభుత్వం గ్రాఫిక్స్తో ప్రచారం చేసుకుంది తప్ప ఇక్కడ జరిగిన అభివృద్ధి శూన్యమని బుగ్గన విమర్శించారు.
మంత్రి స్టేట్మెంట్పై ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ ఇది చాలా బాధాకరమని అన్నారు. అమరావతిపై అక్కసు ఎందుకో అర్థం కావడం లేదని చంద్రబాబు అన్నారు. అధికార పక్ష సభ్యులు అమరావతి కాదు భ్రమరావతి అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ విమర్శలు చేసినా ఎగతాళి చేసినా ఫరవాలేదు, కానీ మీరు ఎక్కిన చెట్టును మీరే నరుక్కుంటున్నారనీ అన్నారు. గతంలో అమరావతిపై అక్కసుతో రైతులను భూములు ఇవ్వద్దు అని రెచ్చగొట్టారు. పంట పొలాలను తగులబెట్టారు. హరిత ట్రిబునల్ లో పిటిషన్ వేశారు, కోర్టులకు వెళ్లారు. ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాయించారు అని చంద్రబాబు విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ చర్యల కారణంగా రాజధానిలో భూముల విలువ అమాతం పడిపోయిందనీ, క్రయ విక్రయాలు నిలిచిపోయాయని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి ఆగిపోయే పరిస్థితికి తీసుకువచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమయంలో అధికార విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
స్పీకర్ అనుమతితో మంత్రులు పలు బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యులు ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. క్లారిఫికేషన్కు అవకాశం కల్పించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. సభ ఆర్డర్కు రాకపోవడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి లేచి 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే ప్రతిపక్ష నేత మంత్రి స్టేట్మెంట్పై అరగంటకుపైగా ఉపన్యాసం చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సి, ఎస్టి,బిసి, మైనార్టీ, మహిళలకు నామినేషన్ పనులలో, నామినేటడ్ పదవుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించే చర్యలు చేపడుతుంటే స్వాగతించాల్సింది పోయి అడ్డుకుంటున్న దిక్కుమాలిన ప్రతిపక్షం ఎక్కడా ఉండదని జగన్ వ్యాఖ్యానించారు. టిడిపి ఓర్వలేక ఈర్షతో సభలో రాద్ధాంతం చేస్తోందని జగన్ విమర్శించారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం సభను రేపటికి వాయిదా వేశారు.