బిగ్బాస్ వార్తలూ, వాటి తీరూ, హడావుడీ పరిశీలిస్తుంటే పుష్కరం క్రిందటి బిగ్ బ్రదర్ షోతోపాటు, శిల్పాశెట్టి వ్యవహారం గుర్తుకు రాకమానదు! ఈ వ్యవహారం అంతా ప్రచారం చుట్టూ నడుస్తుందని భావించక తప్పడం లేదు. శ్వేతారెడ్డి, గాయత్రీ గుప్తా వార్తలకెక్కకముందు పోకడలే పరిశీలించండి. ఒక్క ఛానల్లోనే ప్రసారం అయ్యే ఒక టీవీషోకు సంబంధించి అన్ని వార్తా ఛానళ్ళలో, పత్రికలలో అంత చోటు టైము ఇవ్వాల్సినంత వార్తాకోణం ఉందా? ఏదో పబ్లిక్ రిలేషన్స్ మహాత్యం లేకపోతే పోటీగా సాగే ఛానల్, ప్రకటనల ఆదాయంలో ముందుండే ఛానల్ ప్రసారం చేసే షోకు ఎందుకు స్థానం కల్పిస్తారు? బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో అనుష్క ధరించిన బంగారు నగలు దొంగతనం అయ్యాయని వార్తలు వచ్చి, ఆ సినిమాకు ప్రచారం చేసిన బాపతే ఇది కూడా అనుకోవాలా? ఎవరు బిగ్ బాస్ అంటూ కొంతకాలం, ఎవరెవరు టీంలో ఉంటారని మరికొంతకాలం ప్రచారం నడిచింది. ప్రసారపు తేదీ దగ్గరయ్యేకొద్దీ సంచలనాల హడావుడి పెరుగుతోంది.
2006-2007 ప్రాంతంలో ‘బిగ్ బ్రదర్’ అనే షో ఇంగ్లాండులో రూపొందించారు. అప్పట్లో శిల్పాశెట్టి అనే సినిమానటికి అవకాశం రావడమే గొప్ప అన్నట్టు హిందీ, ఇంగ్లీషు, ఇతర భాషల పత్రికలు, తెగ రాశాయి. ఛానళ్ళు చర్చించాయి. తీరా షో మొదలయ్యాక అందులో జాతిని దృష్టిలో పెట్టుకొని ఆవిడను కించపరచడం తొలుత వార్త అయ్యింది. అప్పటికి మనదేశంలో అలాంటి సంఘటన మొదటిది కావచ్చు, తారాస్థాయిలో రాజకీయంగా దాన్ని చర్చించారు. శిల్పాశెట్టి వైదొలగుతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఆమె వైదొలగలేదు కానీ, కార్యక్రమం పూర్తి అయ్యింది. ప్రసారమయ్యింది. చాలామంది వళ్ళు కుతకుత ఉడికింది. షోకు రేటింగులు పెరిగాయి. సదరు నటికి గుర్తింపు, పైకంతోపాటు సినిమా అవకాశాలు కూడా మెరుగయ్యాయి. ఒక ఎన్.ఆర్.ఐ. పారిశ్రామికవేత్తని పెళ్ళిచేసుకుని లాభపడింది. పోయింది ఒక జాతి పరువు, లాభపడింది ఆ ఛానల్, ఆనటి! అదీ బిగ్బ్రదర్ షో వ్యవహారం. ఆ బిగ్బ్రదర్ షోతో చాలా మొదలయ్యాయి. ఇప్పటి బిగ్బాస్కు మూలాలు అవే!
బిగ్బాస్ టీం ఎంపికలోనే ఎవరికైతే వార్తలకు అవకాశం ఉందో వారినే స్వీకరిస్తారా? శ్వేతారెడ్డి గతంలో శ్వేతపేరుతో ఎన్టీవీలో వార్తలు చదివారు. చక్కగా వార్తలు చదివే యాంకర్గా ఆమెకు పేరుంది. మధ్యలో ఒక రాజకీయ విషయమై సంచలన వార్తగా మారి, బుల్లితెరమీద వార్తలు చదవడం మానివేసినట్టు ఒక పరిశీలన. ఇటీవల ఈ ఎన్నికల ముందు కె.ఏ.పాల్ను విమర్శించడం, ఛానల్లో కేకలు వేసుకోవడం గమనించాం. ఇక ఇపుడు ఈ విషయం? ఈ సంగతి వార్తలలో ఎక్కుతుండగానే గాయత్రీ గుప్త విషయం కూడా సంచలనంగా మారింది. ఫలితంగా మూర్తి టీవీ5లో దీని ఆధారంగా ఒక స్పెషల్ షో చేశారు. వివరాల్లోకి వెడితే ఎవరికైనా వళ్ళు మండుతుంది. టెలివిజన్ రంగం కూడా సినిమారంగంలా మారిందా, ఇక్కడ కూడా కాస్టింగ్ కోచ్ వ్యవహారం పెద్ద ఎత్తున నడుస్తోందా అని సందేహం రాకమానదు. సదరు వ్యక్తులు కోర్టులు ఎక్కడంతోపాటు; ఆ కార్యక్రమం నిర్వాహకులు కూడా బెయిల్ పొందినట్టు వార్తలు వచ్చాయి.
బిగ్బాస్ షో ఈవారంలో మొదలవుతోంది. ఈ నాలుగయిదు రోజుల్లో మరెన్ని సంచలనాలు వస్తాయో చూడాలి. ఇక్కడ ఇంకో విషయం గురించి చెప్పుకోవాలి. సినిమాలకు సెన్సారింగ్ విధానం ఉంది; మరి ఇంటిల్లిపాది ఇంట్లో కూచుని చూసే టీవీకి సెన్సారింగ్ అవసరం లేదా అనేది ఒక వాదన. ఒకవేళ అలా వచ్చినా ఏం ఒరుగుతుంది అనేది ఇంకో ప్రతివాదన. అసలు వాస్తవమేమంటే మనదేశంలో సరైన మెజారిటీ లేని అస్థిర ప్రభుత్వాలు రావడం పాతికేళ్ళక్రితం మొదలైంది. అదే సమయంలో ప్రపంచీకరణ, ఆర్ధిక ఉదారవాదం పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. ఈ కాలంలోనే మనదేశంలో ప్రయివేటు టెలివిజన్ వృద్ధిచెందింది. కనుకనే క్రాస్మీడియా రెగ్యులేషన్ వంటి అంశాలు చర్చకు రాలేదు. ఎంటర్టైన్మెంట్ రంగం అంతా కార్పొరేట్ల చేతుల్లో ఉన్నపుడు ధనార్జన కాకుండా మంచి చెడూ మీమాంస ఉంటుందా!
– డా. నాగసూరి వేణుగోపాల్