విశాఖ: ముఖ్యమంత్రి హోదాలో తొలి సారిగా నేడు వైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. ఉత్తరాంధ్రలోని మూడు జిలాల వైసిపి ప్రజా ప్రతినిధులు, నేతలు, అభిమానులు విశాఖ విమానాశ్రయం వద్దకు చేరుకొని ఘన స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ పెందుర్తి మండలం చిన్న ముషిరివాడలోని శారదా పీఠానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సందర్శకుల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. పలువురు నేతలు జగన్ను కలిసి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
అనంతరం శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామీజీని కలుసుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. స్వామీజీకి పట్టువస్త్రాలను జగన్ సమర్పించారు. ఆశ్రమంలో సిఎం జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా స్వామీజీ రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయించారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వరూపానందేంద్ర స్వామీజీతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణకు మంచి మూహూర్తం తదితర విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో పోటీ చేసే ముందు కూడా స్వరూపానందేంద్ర ఆశీర్వాదాన్ని జగన్ తీసుకున్న సంగతి తెలిసిందే.