అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ గత ఐదేళ్ల కాలంలో ఉద్యమాలు చేసి, పోలీసు కేసులు ఎదుర్కొంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై నమోదైన కేసులను మొత్తం కొట్టేయాలంటూ హోంశాఖ సర్య్కులర్ జారీ చేసింది. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు కేసుల విత్ డ్రా పిటిషన్లు ఫైల్ చేయాల్సిందిగా సూచించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటు ప్రజలు, పలు రాజకీయ పార్టీలు ఆందోళన నిర్వహించాయి. 13 జిల్లాల నవ్యాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని 2014లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం దానిని అమలు చేయలేదు. నీతి ఆయోగ్ సూచనల ప్రకారం.. దేశంలోని ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చెప్పడంతో ఏపీలో ఆందోళనలు వెల్లువెత్తాయి. అప్పుడు ఏపీలో అధికారంలో టీడీపీ ఉండగా, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పెద్ద ఎత్తున హోదా కోసం నిరసనలు తెలిపింది. దీంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసులు అన్నీ ఉపసంహరించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.