(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు దాఖలు చేసిన పిటిషన్ లకు వ్యతిరేకంగా వాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించుకున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీకి ఎపి హైకోర్టు నోటీసు జారీ చేసింది. రాజధాని కేసుల కోసం ముకుల్ రోహత్గీకి అయిదు కోట్ల రూపాయలు ఫీజుగా చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోటి రూపాయలు అడ్వాన్స్ గా కూడా చెల్లించింది. అయితే రోహత్గీకి అయిదు కోట్ల రూపాయలు చెల్లించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రోహత్గీని నియమించడం న్యాయవాదుల చట్టానికి విరుద్ధమని శివాజీ అనే వ్యక్తి పిటిషన్లో పేర్కొన్నారు. పిల్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు..ముకుల్ రోహత్గీకి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది.