అమరావతి: వరద తగ్గుముఖం పట్టిందనీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొన్నది. వరద ముంపు ప్రాంతాలలో శనివారం మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. కృష్ణలంక, గీతానగర్, రామలింగేశ్వరనగర్, శ్రీనగర్ కాలనీ, బాలాజీనగర్, పెదపురిపాక తదితర ప్రాంతాలతో పాటు చల్లపల్లి, మోపిదేవి మండలాల్లోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. పునరావాస కేంద్రాలను తనిఖీ చేశారు. బాధితులకు అందుతున్న సహాయ సహకారాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజికి నిన్న సుమారు ఎనిమిది లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా నేడు ఆరున్నర లక్షలకు తగ్గిందని చెప్పారు. రేపటికి ఇన్ఫ్లో మరింత తగ్గుతుందనీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. శ్రీశైలం నుండి నాగార్జునసాగర్కు, అక్కడ నుండి పులిచింతలకు కూడా ఇన్ఫ్లో తగ్గుతున్నదని తెలిపారు. ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.