(న్యూస్ అర్బిట్ బ్యూరో)
ఉండవల్లి శాసనసభ్యురాలు తాడికొండ శ్రీదేవి కులం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి అధికారికంగా విచారణ మొదలయింది. ఆమె ఎస్.సి కాదంటూ దాఖలయిన పిటిషన్పై గుంటూరు జిల్లా జాయింట్ కలక్టర్ దినేష్ కుమార్ విచారణ జరుపుతున్నారు. తాను ఎస్సి నని నిరూపించే పత్రాలు తీసుకుని బంధువులను వెంటతీసుకుని 26వ తేదీ రావాల్సిందిగా ఆయన ఎమ్మెల్యేకు నోటీసు జారీ చేశారు.
శ్రీదేవి మాల కులానికి చెందిన వ్యక్తి. ఆమె కాపు కులానికి చెందిన వ్యక్తిని వివాహమాడారు. శ్రీదేవి క్రిష్టియన్ మతం స్వీకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో స్వయంగా ఆమే ఒక ఇంటర్వ్యూలో తాను క్రిష్టియన్నని చెప్పుకున్నారు. ఈ వీడియో క్లిప్పింగ్ జతచేసి శ్రీదేవి ఎస్సి రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి ఎలా పోటీ చేస్తారంటూ బిజెపి వారు గతంలో వివాదం లేవదీశారు కూడా. అయితే శ్రీదేవి తర్వాత ఈ వాదనను గట్టిగా ఖండిస్తూ వచ్చారు.
ఇటీవల వినాయకచవితి సందర్భంగా కూడా శ్రీదేవి కులం వివాదం మరోసారి బయటకువచ్చింది. తుళ్లూరు మండలం, అనంతారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక వినాయకుడి పందిరికి వెళ్లినపుడు తనను కులం పేరు పెట్టి దూషించారంటూ ఎమ్మెల్యే చెప్పుకున్నారు.
తాజాగా వచ్చిన విచారణ లీగల్ రైట్స్ ఫోరం అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్ వల్ల మొదలయంది. ఆ సంస్థ వారు నేరుగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తే రాష్ట్రపతి కార్యాలయం అధికారులు దానిని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పంపారు. ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుంచి ఆ పిటిషన్ను గుంటూరు కలక్టర్కు పంపారు.