హైదరాబాద్: హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్టిసి కార్మిక సంఘాలు సమ్మెను విరమించే అవకాశం ఉందా లేక కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం తలపెట్టిన సడక్ బంద్ను రద్దు చేసుకున్నారు. జెసిఎ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి నిన్న రాత్రే ఆసుపత్రిలో తన నిరాహార దీక్షను విరమించారు. మరి కొద్ది సేపటిలో హిమగిరి గార్డెన్స్లో ఆర్టిసి కార్మిక సంఘాల ముఖ్య నేతల సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ కార్మికులు 46 రోజులుగా సమ్మెను ఉధృతంగా కొనసాగిస్తున్నారు. నేడు కూడా అన్ని డిపోల వద్ద సమ్మె కొనసాగించాలని జెఎసి నిర్ణయించింది.
ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలు ఒక అడుగు వెనక్కు వెళ్లడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. రెండు వారాల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ కమిషనర్కు హైకోర్టు సూచించింది. ఇప్పటికే కార్మిక సంఘాలు తమ ప్రధాన డిమాండ్ అయిన ప్రభుత్వంలో ఆర్టిసిని విలీనం చేయడాన్ని పక్కన పెట్టేశాయి. కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నేడు జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కార్మికులు విధుల్లో చేరడానికి సిద్ధపడితే ప్రభుత్వం దానికి సమ్మతిస్తుందా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. మరో పక్క ఆర్టిసి కార్మికుల వేతనాలు, ప్రైవేటు రూట్ పర్మిట్లపై దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. జెఎసి నేతల కీలక సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, దీనిపై ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉంటుందో తెలియాల్సి ఉంది.