అమరావతి: సార్వత్రిక ఎన్నికలు మొదలు కొని టిడిపికి బ్యాడ్ టైమ్ నడుస్తోన్నట్లు ఉంది. వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలోని పార్టీ ఆఫీసుకూ అక్రమ కట్టడమనీ, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి దీన్ని కట్టారంటూ జివిఎంసి అధికారులు నోటీసు జారీ చేశారు. దీనికి తోడు విశాఖలో పలువురు నేతలకు సంబంధించిన భవనాలకు కూడా ఇదే విధంగా నోటీసులు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితమే చంద్రబాబు నివాసం సమీపంలోని ప్రజావేదికను సిఆర్డిఎ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. అక్రమ కట్టడాల నిర్మూలన ఈ ప్రజావేదిక నుండే ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రకటించారు. దీంతో అధికారులు అక్రమకట్టడాలపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కృష్ణానది కరకట్టపై నిర్మించిన చంద్రబాబు నివాసానికి సిఆర్డిఎ అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆయన కూడా నివాసాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
వైసిపి అధికారంలోకి వచ్చినది మొదలు గత ప్రభుత్వ హయాంలో జరిగినవన్నీ తిరగదోడే పనిలో నిమగ్నమయ్యింది. ప్రాజెక్టుల నిర్మాణాలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఇతర అభివృద్ధి పనులు తదితర అంశాల్లో అక్రమాలను వెలికితీసేందుకు సిఎం జగన్ ఆదేశాలతో మంత్రివర్గ ఉపసంఘాన్ని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఒక పక్క ఇక్కడి అధికార పక్షం టిడిపిని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టేందుకు పావులు కదుపుతుండగా కేంద్రంలోని బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టిడిపి నేతలను గంపగుత్తగా చేర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపిలో చేర్చుకోవడంతో పాటు రాజ్యసభలో టిడిపి పార్లమెంటరీ పార్టీనే విలీనం చేసుకున్నది. ఇద్దరు టిడిపి మాజీ ఎమ్మెల్యేలు బిజెపి కండువా కప్పుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పాలవ్వడం ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం మూడు పార్లమెంట్, 23 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కడంతో పలువురు సీనియర్ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.
రాష్ట్రంలో పార్టీ బలోపేతం. చేర్పులపైనా చర్చించేందుకు బిజెపి జాతీయ, రాష్ట్ర నేతలు మంగళగిరి సమీపంలోని హాయ్లాండ్లో రెండు రోజుల పాటు విస్తృత సమాలోచనలు జరిపారు. సుమారు 75మంది నాయకులను బిజెపిలో చేర్చుకునేందుకు వారు కసరత్తు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పరిమాణాలు ఎక్కడి వరకూ దారి తీస్తాయో వేచి చూడాల్సి ఉంది.