వినియోగదారుడి వద్ద కవరుకు రూ. 3 వసూలు
వినియోగదారుల ఫోరంలో సవాలుచేసిన కస్టమర్
బూట్లు కొన్న తర్వాత వాటిని తీసుకెళ్లడానికి కవరు ఇచ్చి, దానికి 3 రూపాయలు అదనంగా వసూలు చేసినందుకు బాటా షోరూంకు మొట్టికాయలు పడ్డాయి. చండీగఢ్ లోని వినియోగదారుల ఫోరం.. ఆ సంస్థకు రూ. 9వేల జరిమానా విధించింది. ఉత్పత్తులు అదే దుకాణం నుంచి కొంటే బ్యాగుకు అదనంగా వసూలు చేయకూడదన్న నిబంధన ఉందని, ఇది దేశవ్యాప్తంగా అన్ని దుకాణాలకు వర్తిస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దినేష్ ప్రసాద్ రాటూరి అనే వినియోగదారుడు చేసిన ఫిర్యాదుతో ఫోరం ఈ ఆదేశం ఇచ్చింది.
సెక్టార్ 22డిలో ఉన్న దుకాణంలో దినేష్ ప్రసాద్ ఫిబ్రవరి 5న బాటా దుకాణంలో బూట్లు కొన్నారు. దానికి దుకాణం వాళ్లు కవరు చార్జితో కలిపి రూ. 402 వసూలు చేశారు. అయితే, పేపర్ బ్యాగుకు కూడా ధర తీసుకోవడాన్ని ఆయన ఖండించారు. బాటా వాళ్లు తమ బ్యాగు మీద లోగో ఉందని చెప్పినా, ఆయన సమాధానపడలేదు. దాంతో తన రూ. 3 తిరిగి ఇవ్వడంతోపాటు సేవలలో లోపానికి నష్టపరిహారం కూడా చెల్లించాలని ప్రసాద్ డిమాండ్ చేశారు. పేపర్ బ్యాగుకు అదనపు ధర తీసుకోవడంపై బాటాపై వినియోగదారుల ఫోరం మండిపడింది. బ్యాగుకు కూడా ధర చెల్లించాలనడం కచచితంగా సేవాలోపమేనని తెలిపింది.
తమ వద్ద కొనుగోలు చేసిన ఉత్పత్తులను తీసుకెళ్లేందుకు బ్యాగు ఇవ్వడం దుకాణదారుల విధి అని స్ఫష్టం చేసింది. ఈ ఆదేశాలను దేశంలో ఎక్కడైనా వినియోగదారులు చూపించవచ్చని, తద్వారా బ్యాగులకు వసూలుచేసే మొత్తాలను చెల్లించనక్కర్లేదని సాగర్ సక్సేనా అనే న్యాయవాది చెప్పారు. బ్యాగు పర్యావరణ అనుకూలమైనా కూడా అదనపు మొత్తం తీసుకోడానికి వీల్లేదన్నారు. పర్యావరణ పరిరక్షణకు కంపెనీలు అంతగా తాపత్రయపడితే, పర్యావరణ అనుకూల బ్యాగులనే ఇవ్వాలని ఫోరం తెలిపింది. బాటా కంపెనీ దినేష్ ప్రసాద్ కు బ్యాగు ఖరీదు రూ. 3, న్యాయవాది ఖర్చులు రూ. 1000, నష్టపరిహారంగా మరో రూ. 3000 చెల్లించాలని ఫోరం ఆదేశించింది. దాంతోపాటు రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ వారి న్యాయసహాయ కేంద్రం ఖాతాలో మరో రూ. 5వేలు డిపాజిట్ చేయాలని కూడా తెలిపింది.