చెన్నై: బీజేపీపై సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కొందరు బీజేపీ రంగు వేయాలని ప్రయత్నిస్తున్నారని, వారి ఉచ్చులో తాను పడనని చెప్పారు. తన గురువు కె.బాలచందర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నటుడు కమలహాసన్ తో కలిసి రజనీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళ ప్రాచీన కవి తిరువల్లూరు చిత్రాన్ని బీజేపీ ట్వీట్ చేయడంపై నెలకొన్నవివాదంపై మీ స్పందన ఏమిటని మీడియా ప్రశ్నించగా, రజనీ సమాధానమిస్తూ.. తిరువల్లూరుతో పాటు తనపై కూడా కాషాయరంగు పులమాలని ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను బీజేపీ వ్యక్తిని కాదని, తనకు కాషాయ రంగు పులమకండి అంటూ రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు. తమిళనాట నాయకత్వ శూన్యత నెలకొందన్నారు. తాను రాజకీయ పార్టీ స్థాపించేవరకు సినిమాల్లో నటిస్తానని పేర్కొన్నారు.
ఇది ఇలా ఉంటే.. రజనీకాంత్ పెట్టే కొత్త పార్టీ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 2017లోనే రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసిన రజనీ.. రెండేళ్లు గడిచినా ఇంకా పార్టీని ఏర్పాటు చేయలేదు. 2021లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతానని ప్రకటించారు. పార్టీ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఆలోపే పార్టీని ప్రారంభించడం, పార్టీ గుర్తు-సిద్ధాంతాలు-ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.