నాగ్ పూర్: తనను నమ్మించి మోసం చేశారంటూ ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత విపుల్ షా పోలీసులను ఆశ్రయించారు. ‘ఇరిడియం వ్యాపారం’ పేరుతో తనకు రూ.5 కోట్ల మేర నష్టం కలిగించారని ఆరోపిస్తూ ముగ్గురు వ్యక్తులపై నాగ్ పూర్ ఆర్ధిక నేర విభాగానికి ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సింగ్ ఈజ్ కింగ్, కమాండో, ఫోర్స్ వంటి సినిమాలను నిర్మించిన విపుల్ షాకి 2010లో రాజ్ సింగ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. విపుల్ ప్రొడక్షన్ హౌస్ లో దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో విపుల్ తో పాటు అతడి వ్యాపార భాగస్వామి వినీత్ సింగ్ పరిచయం పెంచుకుని.. తాము పురాతన కళాఖండాలను సేకరిస్తున్నామని చెప్పాడు. వాటిలో ఉండే అరుదైన ఇరిడియంకి అతీంద్రియ శక్తులు కలిగి ఉంటాయని నమ్మించాడు. రక్షణా రంగంలో కూడా దీన్ని వినియోగిస్తున్నారని మాయమాటలు చెప్పాడు. ఈ వ్యాపారంలో తమకు అండగా నిలిస్తే భవిష్యత్తులో విపుల్ నిర్మాణ సంస్థలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ఆకర్షించడంతో వారి మాటలు నమ్మి విపుల్ ఇరీడియం సేకరణలో భాగంగా ఏకంగా ఐదు కోట్ల మేర ఖర్చు చేశాడు. అయితే ఎన్నిరోజులు గడిచినా వారి నుండి ఆశించిన ఫలితం రాకపోవడంతో విపుల్ తాను మోసపోయినట్లు గుర్తించాడు. ఈ మేరకు శుక్రవారం నాగ్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో రాజ్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా..మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
previous post