(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఇంగ్లిష్ దినపత్రికలతో ఏమాత్రం పరిచయం ఉన్నా న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ పత్రికల పేర్లు తప్పనిసరిగా తెలుస్తాయి. అంత ప్రసిద్ధి చెందిన పత్రికలు అవి. అమెరికాలో వాటికున్న ప్రతిష్ట మామూలుది కాదు. అట్లాంటి పత్రికలు ఇక అమెరికా అధ్యక్షభవనం వైట్హౌస్లో కనబడవు. ఆ రెండు పత్రికలకూ ఇక చందా కట్టవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్ అధికారులను ఆదేశించారు.
నిర్భయంగా వార్తాకథనాలు ప్రచురించే న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ పత్రికలపై ట్రంప్ చేలాకాలంగా దాడి చేస్తున్నారు. వాటిని ఆయన ఫేక్ పత్రికలు అంటారు. వైట్హౌస్ మాత్రమే కాకుండా మిగతా ఫెడరల్ ప్రభుత్వ విభాగాలను కూడా ఆయన ఆ రెండు పత్రికలకూ చందా ఆపేయాల్సిందిగా ఆదేశించారు. కొద్ది రోజుల క్రితం ట్రంప్ ఫాక్స్ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ, ఈ పని చేస్తానని సూచనప్రాయంగా చెప్పారు కానీ, అప్పుడు దానిని ఎవరూ సీరియస్గా తీసుకోలేదు.
అధ్యక్షుడు నివసించే వైట్హౌస్లోని వెస్ట్వింగ్లో ఇక న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ కనబడవని అధికారులు తెలిపారు. అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచీ ఈ రెండు పత్రికలనూ బహిష్కరించినందువల్ల వేలాది డాలర్ల ప్రజాధనం ఆదా అవుతుందని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ స్టెఫానీ గ్రిషామ్ పేర్కొన్నారు.