కర్ణాటక: ద కారవాన్ పత్రిక ప్రచురించిన ‘యెడ్డీ డైరీస్’ దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నది.
బిజెపి అగ్రనేతలకు యడ్యూరప్ప 1800 కోట్ల రూపాయలు చెల్లించినట్టు యడ్యూరప్ప డైరీలో ఉందంటూ కారవాన్ మ్యాగజైన్ ఒక కధనాన్ని ప్రచురించింది.
కారవాన్ కథనం ప్రకారం, కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ లెజిస్లేచర్స్ 2009 డైరీలో యడ్యూరప్ప తన సంతకంతో ఈ చెల్లింపుల గురించి రాశారు. డైరీలోని పేజీల ఆధారంగా, బిజెపి సెంట్రల్ కమిటీకి యడ్యూరప్ప వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరికి చెరో 150 కోట్ల రూపాయలు, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు 100 కోట్ల రూపాయలు, బిజెపి అగ్ర నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు చెరో 50 కోట్ల రూపాయలు ఇచ్చారు. గడ్కరి కుమారుడు పెళ్లికి కూడా 10 కోట్ల రూపాయలు యడ్యూరప్ప చెల్లించారు.
కారవాన్ కథనంపై కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది. ‘యడ్యూరప్ప కర్నాటక సీఎంగా ఉన్న సమయంలో బిజెపి కేంద్ర కమిటీ 2,690 కోట్ల రూపాయలు అడిగినట్టు డైరీలో ఉంది. యడ్యూరప్ప మాత్రం 1800 కోట్ల రూపాయలు చెల్లించారు. ఈ డైరీ 2017 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ విభాగం దగ్గర ఉంది. ఆ డైరీలో నిజం లేకుంటే బిజెపి ఎందుకు దర్యాప్తు చేయించడం లేదు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా బిజెపిపై విరుచుకుపడ్డారు.
ఈ వార్తా కథనంపై బిజెపి నేతలు స్పందించాలని సుర్జేవాలా డిమాండ్ చేశారు. ఈ కథనం వాస్తవమా కాదా అనేది బిజెపి తక్షణమే వివరణ ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారంపై లోక్పాల్ దృష్టిసారించాలని సుర్జేవాలా డిమాండ్ చేశారు.
మరోవైపు కాంగ్రెస్ చేసిన ఆరోపణలను బిజెపి తోసిపుచ్చింది. బిజెపిని విమర్శించేందుకు కాంగ్రెస్ నకిలీ డైరీ పత్రాలను చూపుతోందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
యడ్యూరప్ప డైరీలో వెలుగుచూసిన అంశాల ఆధారంగా చేస్తోన్న ఆరోపణలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తోసిపుచ్చిందని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. అసలు డైరీ ఒరిజినల్ పత్రాలు ఎక్కడున్నాయని అయన ప్రశ్నించారు. మీడియా కథనాల ఆధారంగా కాంగ్రెస్ తమ పార్టీపై బురదజల్లుతోందని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.
యడ్యూరప్ప కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. తనకు అసలు డైరీ రాసే అలవాటే లేదన్నారు. కాగితాలపై ఉన్నది తన చేతి రాత తనది కాదనీ,తన సంతకాలు కావనీ యడ్యూరప్ప స్పష్టం చేశారు. అవి నకిలీ పాత్రలనీ, తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు ఎవరో తన పేరుని వాడుకొని పుట్టించిన కల్పిత కథలనీ యడ్యూరప్ప పేర్కొన్నారు.
‘నేను పరువు నష్టం కేసును దాఖలు చేయాలని ఆలోచిస్తున్నాను. ఇవి తప్పుడు ఆరోపణలు. ఐటి శాఖ అధికారులు పరిశీలించి ఈ పత్రాలు, సంతకాలు నకిలీవని గుర్తించారు. ఇందులో రాజకీయ కుట్ర ఉంది’ అని యడ్యూరప్ప అన్నారు.