ఢిల్లి: ప్రైవేటు వ్యాపార సంస్థలు నిర్వహించే ఆధార్ సేవలకు ఇకపై ప్రతి వినియోగదారుడి దృవీకరణ కోసం 20రూపాయలు, ఆధార్ ప్రమాణీకరణ కోసం 50పైసలు చెల్లించాల్సి ఉంటుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా(యూఐడిఎఐ) నోటిపికేషన్లో పేర్కొంది.
ఆధార్ రెగ్యులేషన్స్ 2019 ప్రకారం ప్రభుత్వ సంస్థలకు, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లకు లావాదేవీ చార్జీలలో మినహాయింపు ఇచ్చారు. ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేట్ సేవలు అందిస్తున్న షెడ్యూల్, కమర్షియల్ బ్యాంకులకు అథెంటికేషన్ చార్జీల నుండి మినహాయింపు ఇచ్చింది. అధార్ నమోదు, అప్డేట్ లక్ష్యాలను అవి చేరలేకపోతే టార్గెట్కి తగ్గట్టుగా నిర్దేశిత మొత్తం కట్టాల్సి ఉంటుంది.
మిగిలిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇక ఆధార్ ప్రామానిక సేవలు పొందుతున్నందున లావాదేవీల రుసుము చెల్లించాల్సిందే. సంబంధిత ఇన్వాయిస్ జారీ చేసిన 15 రోజల్లోనే ఈ చెల్లింపులను ఆయా సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది. 15రోజులు దాటితే నెలకు 1.5శాతం వడ్డీ విధించడంతో పాటు ఇ కెవైసి సేవలను నిలిపివేస్తామని యుఐడిఎఐ హెచ్చరించింది.
ఇప్పటికే అధార్ అధారిత దృవీకరణ సర్వీసులు వినియోగించుకుంటున్న సంస్థలు తాజాగా నోటిఫికేషన్ విడుదల తరువాత కూడా కొనసాగించిన పక్షంలో ఆయా సంస్థలు నిర్దేశిత నిబంధనలు, చార్జీలను అంగీకరించినట్లుగానే భావించడం జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆధార్ అర్డినెన్స్కు సవరణల కారణంగా ఆధార్ అథెంటికేషన్ సేవలు పొందేందుకు పలు సంస్థలకు అర్హత లభించినట్లు అవుతుందని వివరించాయి. అయితే ఆయా సంస్థలు భద్రతాపరమైన షరతులన్నింటినీ అమలు చేయాల్సి ఉంటుంది.
ఇకెవైసి వినియోగానికి సంస్థలు ఎక్కువగా ఆధార్ను ప్రామాణికంగా తీసుకుంటాయి. యుఐడిఎఐ తాజా నిర్ణయంతో ఐకెవైసి వినియోగించుకునే సంస్థలపై భారం పడనుంది. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి చార్జీలు తీసుకోలేదనీ, ఇప్పుడు విధించినది నామమాత్రమేనని ఆధార్ సంస్థ పేర్కొంది.
ఆధార్ లేకుండానే కెవైసి దృవీకరణ జరపాలంటే ప్రస్తుతం వ్యాపార సంస్థలకు దాదాపు 150రూపాయల నుండి 200రూపాయల వరకూ ఖర్చు అవుతోంది. సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే అధార్ ఆధారిత కేవైసి దృవీకరణతో ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఇంటింటికీ తిరిగి వ్యయప్రయాసలకు గురవుతున్నామని సంస్థలు మొరపెట్టుకున్నాయి.
అధికారికంగా ఆధార్ ఆధారిత దృవీకరణ, కేవైసీ సేవలు పొందుతామని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. దీని వల్ల తమతో పాటు వినియోగదారులకు సౌలభ్యమని వాదిస్తున్నాయి. దీంతో సౌలభ్యం దృష్యా ఆధార్ అధారిత కేవైసీ సర్వీసుల కోసం ఆయా సంస్థలు కోరుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి.