న్యూఢిల్లీ: భారత దేశంలో ఆర్ధిక మందగమనం లేదట. ఈ మాట చెప్పింది మరెవరో కాదు స్వయాన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఇందుకు సాక్ష్యం ఇటివల విడుదలైన సినిమాలే కారణమని ఆయన చమత్కరించారు. అక్టోబర్ 2న విడుదలైన మూడు సినిమాలు రూ.120 కోట్ల వసూళ్లు రాబట్టడంతో ఇక దేశంలో ఆర్ధిక మాంద్యం ఎక్కడుందని ప్రశ్నించారాయన. దేశంలో ఆర్ధిక మందగమనం లేదనడానికి సినిమాల కలెక్షన్లే నిదర్శమని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం శనివారం ముంబై వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బేసిగ్గా నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్. వాజపేయి హయాంలో ఐబీ మంత్రిగా సినీ ఫీల్డ్ను దగ్గర్నుంచి చూశా. దేశంలో మూవీ మార్కెట్ జోరుగా సాగుతోంది. మొన్న గాంధీ జయంతి నాడు నేషనల్ హాలిడే. ఆ ఒక్కరోజే బాలీవుడ్లో విడుదలైన మూడు పెద్దసినిమాలు 120 కోట్ల కలక్షన్లు వచ్చాయని నా ఫ్రెండ్స్ చెప్పారు. సినిమాలే ఇంత బాగా ఆడుతున్నప్పుడు ఇక ఆర్థిక మాంద్యం ఎక్కడిది? ఎకానమీపై ఎవరూ భయపడాల్సిన అవసరంలేదు”అని మంత్రి రవిశంకర్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎలెక్ట్రానిక్స్ పరిశ్రమ, తయారి పరిశ్రమ, ఐటి ఇండస్ట్రీ, ముద్ర ఋణాలు, వాణిజ్యం, సేవల విభాగాలు చక్కగానే పనిచేస్తున్నాయని ఉటంకించారు. అదికాకుండా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాలంలో భారత్ ప్రపంచంలో 11 వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఫ్రాన్స్ ను సైతం తలదన్ని ప్రపంచ స్థాయిలో ఐదవ ఆర్ధిక శక్తిగా నిలిచిందని చెప్పారు.
ఇక నేషనల్ శాంపిల్ సర్వే అఫీస్ డాటాపై మాట్లాడుతూ, తాము ఇచ్చిన 10 రకాల గణాంకాలను ఎక్కడా నివేదికలో చూపించ లేదన్నారు. ‘ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మేము ఎప్పుడూ చెప్పలేదు. కొంత మంది వ్యక్తులు వ్యూహాత్మకంగా తప్పదారి పట్టిస్తున్నారు’ అని రవిశంకర్ అన్నారు. ఎన్ఎస్ఎస్ఓ మన దేశ నిరుద్యోగం గత నలభై ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయిందంటున్నారు. అది 2017-18 సంవత్సరానికి 6.1 గా ఉందని ఒక ప్రముఖ ఆర్ధిక పత్రిక బిజినెస్ స్టాండర్డ్ ను ఉటంకిస్తూ.. 1972-73 సంవత్సరంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉండేదని, 2011-12 ఆర్ధిక సంవత్సరాలకు అది 2.2% మాత్రమేగా రికార్డైదని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
అక్టోబర్ 2న సైరా, వార్, జోకర్ .. మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాలు కలిపి రూ. 120 కోట్ల వసూళ్లు రాబట్టాయి. భారత దేశవ్యాప్తంగా ఆర్ధిక మందగమనం అనేక రంగాలను కుదేలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రం ప్రభుత్వం దీన్ని అధిగమించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. పన్నులు తగ్గించడంతో పాటు, బ్యాంకుల విలీనం లాంటి ప్రక్రియలను చేపట్టింది. అయితే జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టానికి పడిపోయినవేళ కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.