అమరావతి: ప్రజావేదికను కూల్చివేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రకటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. కృష్ణా నది ఒడ్డున పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలలో ఉండవల్లిలోని ప్రజావేదిక కూడా ఒకటి కాబట్టి దానిని బుధవారం కూల్చివేయాలని జగన్ నేడు కలక్టర్ల సమావేశంలో ప్రకటించారు.
ఈ నిర్ణయం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును డిఫెన్స్లో పడవేయకతప్పదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అక్రమ నిర్మాణం చేపడితే ఏం చేయాలని జగన్ ప్రశ్నించారు. ఒక అక్రమ నిర్మాణంలో కూర్చుని పర్యావరణం గురించి సమీక్ష జరపడం ఎంత హాస్యాస్పదమో ఆలోచించాలని ఆయన అన్నారు. ఆచరించి చూపుదాం. ఇదే ఇక్కడ చివరి సమావేశం. రేపు ఎస్పిల సమావేశం జరుగుతుంది. ఎల్లుండి దీనిని కూల్చివేయండి అని జగన్ ఆదేశించారు.
ప్రజావేదికను పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారన్న సంగతి అలా ఉంచితే, ప్రతిపక్ష నేతగా తన కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు దానిని తనకు కేటాయించాల్సిందిగా చంద్రబాబు ఇటీవల ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఆయనకు ఎలాంటి వర్తమానం రాలేదు. కలక్టర్ల సమావేశం కోసం ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నపుడు టిడిపి నాయకులు అభ్యంతరం వెలిబుచ్చారు కూడా. తమ పార్టీ అధినేత విదేశీ పర్యటనలో ఉన్నపుడు ప్రజావేదికను స్వాధీనం చేసుకోవడం ఏమిటని వారు ప్రశ్నించారు.
చంద్రబాబు విజ్ఞప్తికీ, టిడిపి నాయకుల విమర్శలకూ ముఖ్యమంత్రి జగన్ కలెక్టర్ల సమావేశంలో తన ప్రసంగం ద్వారా జవాబిచ్చారు. ఏడున్నర కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం నిర్మించిన కట్టడాన్ని కూల్చివేయాలని ఆయన నిర్ణయం తీసుకోవడం సాహసోపతమైన చర్య కిందకే వస్తుంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం సంగతి అలా ఉంచితే కృష్ణానది ఒడ్డునే ఇంకా చాలా అక్రమ కట్టాడాలు ఉన్నాయి. నిజానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నివసించిన, ఇంకా నివసిస్తున్న భవనం అక్రమ కట్టడమే. ఆ భవనం లింగమనేని రమేష్ అనే జనసేన నాయకుడికి చెందినది.
ఇంకా మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, గణపతి సచ్చిదానంద స్వామి, మంతెన సత్యనారాయణ రాజు వంటివారికి కూడా అక్కడ నిషేధిత ప్రాంతంలో భవనాలు ఉన్నాయి. మొత్తం 158 కట్టడాలు అక్రమంగా నిర్మించినట్లు గుర్తించారు. ఇప్పుడు ప్రజావేదిక తర్వాత చంద్రబాబు నివాసం సహా అన్ని అక్రమ కట్టాడాలనూ జగన్ కూల్చివేయిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలా కాలం నుంచీ ఈ అక్రమ కట్టాడాలపై దృష్టి పెట్టారు. ఆయన ప్రయత్నాల కారణంగానే వాటికి గతంలో గ్రీన్ ట్రైబ్యునల్ నోటీసులు ఇచ్చింది.