అమరావతి, మార్చి 27: ఎన్నికల విధులకు సంబంధం లేని ఇంటిలిజెన్స్ చీఫ్ ఎబి వెంకటేశ్వరరావును బదిలీ చేయాలని ఇసి ఆదేశాలు జారీ చేయడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబట్టారు. ఏ కారణంతో ఐపిఎస్ అధికారులను బదిలీ చేశారో ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల విధులకు సంబంధం లేని వ్యవస్థ ఇంటిలిజెన్స్ అని పేర్కొన్నారు. తన భద్రతను పర్యవేక్షించే అధికారిని కూడా బదిలీ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వీటిపై న్యాయపోరాటం కూడా చేస్తామని అన్నారు.
జగన్ కోరితే ఎవరినైనా బదిలీ చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో బుధవారం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చేసిన తప్పులు బయటపడతాయనే కడప ఎస్పిని బదిలీ చేయించారా అని ప్రశ్నించారు. బాబాయి వివేకానంద రెడ్డి చనిపోతే సాక్షాలన్నీ మాయం చేసి సిబిఐ విచారణ కోరారని, ఇప్పుడు అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశమున్నందున భయపడి ఎస్పినే బదిలీ చేయించారని విమర్శించారు.
కేంద్రం,ఈసి, తెలంగాణ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ద సంస్థ ఈసి కూడా కుట్రలో భాగస్వామి అవుతుండటం దుర్మార్గమని చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై నేడు ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది చేయడానికి ఇసి ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. అవసరమైతే ఇసి తీరుపైనా జాతీయ స్థాయిలో ఉద్యమిద్దామని చంద్రబాబు పిలుపు నిచ్చారు.
మోది మళ్లీ గెలిస్తే మైనార్టీలు ఎవ్వరూ బయటకు రాలేని అభద్రత వాతావరణం నలకొంటుందనీ, గోద్రా లాంటి ఘటనలు పునరావృత్తం చేసేందకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
కనిగిరి అభ్యర్థి ఉగ్రనర్శింహరెడ్డికి చెందిన ఆసుపత్రిపై జరుగుతున్న దాడులు కక్షసాధింపు చర్యలో భాగమేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.