న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలలో ఎన్నారై ఓటర్లకు ఆన్ లైన్ ఓటింగ్ అందుబాటులోకి వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ ఫేక్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. భారతీయ పాస్ పోర్టు కలిగిన ఎన్నారై ఓటర్లు ఎన్నికల కమిషన్ సైటులో రిజిస్టర్ చేసుకోవాలని అందులో చెబుతున్నారు. ఎన్నారై ఓటరుగా నమోదు చేసుకుంటే 2019 ఎన్నికలకు ఆన్ లైనులో ఓటు వేయచ్చని, ఈ విషయం అన్ని గ్రూపులకూ చెప్పాలని అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్ సైట్ లింకు కూడా అందులో పెడుతున్నారు.
‘ఆల్ట్ న్యూస్’ వెబ్ సైట్ ఈ విషయాన్ని లోతుగా పరిశీలించినపుడు, ఎన్నారై ఓటర్లు రిజిస్టర్ చేసుకోవడం వరకు నిజమేనని తేలింది. కానీ అది ఆన్ లైన్ ఓటింగుకు కాదు.. మామూలుగా ఓట్లు వేయడానికి ఎన్నారై ఓటర్లుగా నమోదు చేసుకోవడమే. తమ భారతీయ పాస్ పోర్టు తీసుకుని వాళ్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఇక్కడ ఈవీఎంలోనే ఓటేయాలి. విదేశాల్లో ఉంటున్న భారతీయులు ఆన్ లైన్ లో 6ఎ దరఖాస్తు పెట్టుకోవాలి. లేదా ఓటరు హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ఉపయోగించచ్చు. దీన్ని ఈసీఐ అధికార ప్రతినిధి కూడా చెప్పారు, వెబ్ సైట్ లోనూ పేర్కొన్నారు.
ఎన్నారైల ఓటింగు గురించి ఇలాటి ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారిపై ఎన్నికల కమిషన్ చివరకు ఢిల్లీ డీసీపీకి ఫిర్యాదు కూడా చేసింది. విదేశాల్లో ఉంటున్న భారతీయులు ప్రాక్సీ ఓటింగు సదుపాయం ఉపయోగించుకోడానికి వీలుగా గత ఆగస్టులో లోక్ సభ బిల్లును ఆమోదించింది. అది ఇంకా రాజ్యసభలో పెండింగులో ఉంది.
https://twitter.com/SpokespersonECI/status/1098595992457437184