అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని లొంగదీసుకునేందుకే తప్పుడు కేసు పెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వంశీ వ్యవహారంపై చంద్రబాబు మరోసారి మాట్లాడారు. టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు వైసీపీ ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసేందుకు… సరెండర్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వంశీపై కేసు పెట్టడం కాదు… ఎమ్మార్వో, ఎస్సైలను అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కోడి కత్తి కేసు ఏమైందని ప్రశ్నించారు. సొంత బాబాయి వైయస్ వివేకా హత్య కేసును ఇంత వరకు తేల్చలేకపోయారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులన్నింటినీ రివర్స్ టెండరింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ చేస్తున్నది రివర్స్ టెండరింగ్ కాదని… అది రిజర్వ్ టెండరింగ్ అని విమర్శించారు.
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, వంశీని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ. వంశీ రాజీనామాపై పలువురు టీడీపీ ముఖ్య నేతలు స్పందించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుకు వంశీ లేఖ రాయడం.. ఆయన రిప్లై ఇవ్వడం ఇవన్నీ జరిగిపోయాయి. రాజకీయాల నుంచి తప్పుకున్నంత మాత్రాన వైసీపీ నేతల అరాచకాలు ఆగిపోవంటూ వంశీకి సమాధానం ఇచ్చారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న దానిపై మనమంతా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీపై పోరాటంలో అండగా ఉంటామని వంశీకి చంద్రబాబు భరోసా ఇచ్చారు. పార్టీపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటానని, రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై రాజ్యాంగ సంస్థలకు ఫిర్యాదు చేద్దామని సూచించారు. తాజాగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మరోసారి స్పందించారు.