ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని శివసేన పట్టుబట్టడంతో బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరో ఐదేళ్ల పాటు తానే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న ఫార్ములాపై ఒప్పందం ఏమీ లేదని ఆయన వెల్లడించారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో స్థిరమైన, సమర్థవంతమైన సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శివసేనకు సీఎం పదవి ఇవ్వాలని ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలిపారని చెప్పారు.
మరోవైపు తొలిసారిగా థాక్రే కుటుంబం నుంచి వర్లీ అసెంబ్లీ బరిలో దిగిన శివసేన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన గట్టి ప్రయత్నాలే చేస్తోంది. మహారాష్ట్రలో సర్కార్ ఏర్పాటులో తాము ఏ మాత్రం తగ్గేది లేదన్న సంకేతాలు ఇస్తోంది. ఈ అంశమై శివసేన నేత సంజయ్ రౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి నేతల తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదన్నారు. ఇంకో అడుగు ముందుకేసి బిజెపి బెదిరింపులకు భయపడేందుకు శివసేనలో దుష్యంత్ చౌతాలా లాంటి జైల్లో మగ్గుతున్న తండ్రులున్న వారెవరూ లేరని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56 సీట్లను గెలుచుకున్నాయి. అయిదుగురు ఇండిపెండెంట్లు మద్దతివ్వడంతో శివసేన బలం 61కి పెరిగింది. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న డిమాండ్ ను శివసేన తీసుకొచ్చింది. అయితే, బీజేపీ మాత్రం ఇందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో శివసేనకు డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేస్తోంది. ఇదిఇలా ఉంటే.. సీఎం దేవేంద్ర ఫడణవీస్, శివసేన వేర్వేరుగా గవర్నర్ భగత్సింగ్ ని కలవడంతో మరింత వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి.