అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా హెలికాప్టర్ నుండి ఎగువ కాపర్ డ్యామ్, స్పిల్వే పనులను పరిశీలించారు. అనంతరం డ్యామ్ వద్ద నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నిర్మాణ సంస్థ ప్రతినిధులూ ప్రాజెక్టు పురోగతి వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.
పోలింగ్ ముగిసిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ఇదే ప్రధమం. ఎన్నికల ఫలితాల వెల్లడి అయ్యే వరకూ అంటే ఈ నెల 23వ తేదీ వరకూ రాష్టంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించగా ఎన్నికల సంఘం, సిఎస్, ప్రతిపక్ష పార్టీ నుండి విమర్శలు ఎదురయ్యాయి. అధికారుల చర్యలను చంద్రబాబు తప్పుబట్టారు. రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలను రివ్యూ చేయవద్దంటే ఎలా అంటూ మండిపడ్డారు. దీనిపై ఇసికి కూడా లేఖ రాశారు. అయితే దానిపై ఇంత వరకూ సమాధానం రాలేదు.
ఒక పక్క ఇసి అభ్యంతరాలు, ప్రతిపక్ష విమర్శలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శించి సమీక్ష నిర్వహించి తీరుతానని నిన్న ప్రకటించారు. ఆయన చెప్పిన విధంగా సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ ఉన్న అధికారుల నుండి చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఉన్నతాధికారులు డుమ్మా
కాగా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పరిశీలన కార్యక్రమానికి జలవనరుల శాఖ కార్యదర్శి గైర్హజరు అయ్యారు. ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు కూడా హజరుకాలేదు.