అమరావతి: గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పులు ఇకమీదట జరగకూడదన్న విధానంపైనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా దృష్టి సారిస్తున్నారు. కలెక్టర్ల సమావేశంలో రెండవ రోజు కూడా ఆయన ఇదే అంశంపై నొక్కి చెప్పారు. మంగళవారం సమావేశంలో జిల్లాల పోలీసు సూపరింటెండెట్లు, పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
అక్రమ కట్టడాలను కూల్చి వేయాలన్న తన నిర్ణయంలో మార్పు లేదని జగన్ తేల్చిచెప్పారు. కూల్చివేతకు ఆదేశం ఇచ్చిన ప్రజావేదిక అక్రమ కట్టడమేనని అంటూ, ఆ మేరకు జలవనరుల శాఖ ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి చూపించారు. మాజీ ముఖ్యమంత్రి కూడా అక్రమ కట్టడంలోనే ఉంటున్నారని ఆయన చంద్రబాబు నివాసం గురించి వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు యధేచ్ఛగా జరిగాయనీ, రాజకీయ వత్తిళ్లతో పోలీసులు కూడా ఇసుక మాఫియాను ఉపేక్షించారనీ ఆయన అన్నారు. ఎమ్మెల్యేల అవినీతి కార్యకలాపాలను పోలీసులు పట్టించుకోలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నివాసం సమీపంలోనే ఇసుక తవ్వుతుంటే ఎనరూ పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే ప్రజాప్రతినిధులను గౌరవించడం కూడా ముఖ్యమేనని ఆయన అన్నారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిందేనని ఆయన అన్నారు. అయితే వారు తప్పు చేయమంటే చెయ్యాల్సిన పని లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా ప్రతినుధులతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలనీ, వారికి మర్యాదగానే మంచీ చెడూ వివరించాలనీ ఆయన అన్నారు.
కొంతకాలం క్రితం విజయవాడలో బయటపడిన కాల్మనీ సెక్స్ రాకెట్ విషయం ప్రస్తావిస్తూ, దీనిలో ఎన్ని కేసులు పెట్టారని జగన్ ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులపై ఎలా నమ్మకం ఉంటుందనీ, రాష్ట్ర పోలీసు యంత్రాంగం నంబర్ వన్ ఎలా అవుతుందనీ ఆయన ప్రశ్నించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ముఖ్యమనీ, ప్రత్యేకించి దళితులకు అండగా ఉండాలనీ జగన్ అన్నారు. మహిళలపై నేరాలను అరికట్టాలనీ, సైబర్ క్రయింపై దృష్టి సారించాలనీ ఆయన పేర్కొన్నారు.
అవినీతి, చట్టవ్యతిరేక కార్యకలాపాలను అణచివేసే విషయంలో తాను జోక్యం చేసుకోబోననీ, ఎవరన్నా జోక్యం చేసుకుంటే పోలీసు అధికారులు పట్టించుకోనవసరం లేదనీ జగన్ నొక్కి చెప్పారు. ఉన్నత స్థాయిలో తాము అవినీతికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామనీ, దీనితో 50 శాతం అవినీతి అంతమవుతుందనీ, ఉద్యోగులు కూడా నిజాయితీగా ఉంటే మిగతా 50 శాతం అవినీతి తొలగిపోతుందనీ జగన్ అన్నారు. ఎస్ఐ దగ్గర నుంచి డిఎస్పి వరకూ ఎలా పని చేస్తున్నదీ ఎస్పిలు ఎప్పటికప్పుడు వాకబు చేసుకోవాలని ఆయన కోరారు.
దేశంలో మొదటిసారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తున్నామనీ, దీని వల్ల పోలీసు సిబ్బంది పనితీరు మెరుగుపడుతుందనీ ముఖ్యమంత్రి అన్నారు. ప్రత్యేకహోదా ఉద్యమం సందర్బంగా పెట్టీన కేసులు అన్నీ ఎత్తివేయాలని ఆయన ఆదేశించారు.