న్యూఢిల్లీ: గుజరాత్లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్ల ఉపఎన్నికల విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అమిత్ షా, స్మృతి ఇరానీ లోక్సభకు ఎన్నికయిన మీదట ఈ స్థానాలకు రాజీనామా ఇచ్చారు.
ఈ రెండు స్థానాలకూ జూలై అయిదవ తేదీన ఎన్నికల జరుగుతాయని ప్రకటించిన ఎన్నికల కమిషన్ రెండిటికీ నోటిఫికేషన్ మాత్రం విడివిడిగా ఇస్తారని పేర్కొన్నది. ఫలితంగా రెండు స్థానాలకూ విడివిడిగా ఎన్నికలు జరుగుతాయి. తమకు అసెంబ్లీలో ఉన్న బలంతో ఒక సీటు గెలిచే అవకాశం ఉందనీ, అది జరగకూడదన్నఉద్దేశ్యంతో ఎన్నికల కమిషన్ అధికారపక్షం వత్తిడితో ఈ విధంగా విడివిడిగా ఎన్నికలు ప్రకటించిందని కాంగ్రెస్ అంటున్నది.
రెండిటికీ ఒకేసారి ఎన్నిక జరపాలని కోరుతూ గుజరాత్ కాంగ్రెస్ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు పరేష్ భాయ్ ధనానీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తాము ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. అవసరమైతే ఎన్నిక పూర్తయిన తర్వాత ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది.