అమరావతి: అర్టిసికి సంభందించి ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించనుంది. కొత్తగా ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయనుంది.ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై నిపుణుల కమిటీ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి నివేదిక సమర్పించింది.
మాజీ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ ఆంజనేయరెడ్డి నేతృత్వంలో నిపుణుల కమిటీ 90 రోజులపాటు అధ్యయనం చేసింది.ఈ నివేదికలోని పలు అంశాలపై ముఖ్యమంత్రి నిపుణుల కమిటీతో చర్చించారు.
రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రవాణాశాఖ కమీషనర్ తిరుమల కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియా ప్రతినిధులకు వివరించారు. ముఖ్య మంత్రి వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఆర్టీసీ విలీనంపై నిపుణుల కమిటీని నియమించామని మంత్రి పేర్ని నాని తెలిపారు.
ఆర్టీసీలోని ఉద్యోగులందరినీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేయడానికి సీఎం ఆమోదం తెలిపారని నాని చెప్పారు. దీనిపై ప్రభుత్వం రేపు నిర్ణయం తీసుకుంటుందని నాని వెల్లడించారు. ప్రభుత్వంలో కొత్తగా ప్రజా రవాణా శాఖను ఏర్పాటు చేసి దానిలోకి ఆర్టీసీ ఉద్యోగులందరినీ తీసుకొస్తామనే అంశాన్ని ముఖ్యమంత్రి సూచన ప్రాయంగా తెలిపారని పేర్ని నాని తెలిపారు. విధి విధానాలు త్వరలో ఖరారవుతాయని మంత్రి అన్నారు.
సుదీర్ఘకాలంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ ఎదురుచూస్తున్న కల ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో నెరవేరబోతోందని మంత్రి చెప్పారు. ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాన్ని రేపు ప్రకటించనుందని నాని వెల్లడించారు.
సుమారు 3,300 కోట్ల రూపాయల నుండి 3,500 కోట్ల రూపాయల వరకూ ఆర్టీసీ మీద భారం ఉందనీ, ఆ భారాన్ని ప్రభుత్వం తీసుకోబోతుందని మంత్రి చెప్పారు.దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రవేశపెడుతున్నట్టు మంత్రి తెలిపారు.