అమరావతి: తాడికొండ వైసిపి దళిత శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవిపై జరిగిన కుల దూషణ వ్యవహారం రాజకీయ రంగు పులుపుకొంటోంది. తనపై కులదూషణకు పాల్పడి అవమానపర్చిన దోషులతో పాటు అటువంటి వారిని పెంచి పోషిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబుపైనా కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే శ్రీదేవి డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వెంటనే స్పందించారు. గుంటూరు జిల్లా ఎస్పిని పద్మ కలిసి మాట్లాడారు. ఎమ్మెల్యేని కులం పేరుతో దూషించిన వారిని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని పద్మ డిమాండ్ చేశారు. మహిళా దళిత ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని పద్మ ప్రశ్నించారు. దళిత ఎమ్మెల్యే దేవుడు దగ్గరకు వెళితే మైల పడతారని మాట్లాడటం ప్రజాస్వామ్య, రాజ్యాంగ విరుద్ధమని పద్మ పేర్కొన్నారు.
వైసిపి దళిత మహిళా ఎమ్మెల్యే శ్రీదేవిని వినాయక పందిరి వద్ద కొందరు టిడిపి శ్రేణులు కులం పేరుతో దూషించి అవమానకరంగా మాట్లాడారన్న అభియోగంపై నలుగురు వ్యక్తులు కొమ్మినేని శివయ్య, కొమ్మినేని సాయి, కొమ్మినేని రామకృష్ణ, కొమ్మినేని బుజ్జిపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో సెక్షన్ 509, 294 ఆర్/డబ్ల్యు 34ఐపిసి, సెక్షన్ 3(1)ఆర్, 3(1)(ఎస్) ఎస్సి, ఎస్టి అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది.